ట్రోలర్స్ గురించి తెలిసిందేగా.. ఎక్కడైనా ఒక చిన్న లొసుగు దొరికితే చాలు, ట్రోల్ చేసేందుకు రెడీగా ఉంటారు. అవతల ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా సరే.. ఒక చిన్న తప్పు దొరికితే చాలు, నెట్టింట్లో ఏకిపారేస్తారు. ఇప్పుడు హీరో మాధవన్ పై అలాగే ఎగబడ్డారు. తన రాకెట్రీ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజా ప్రెస్ మీట్ లో.. మార్స్ మిషన్ సక్సెస్ అవ్వడం వెనుక పంచాంగం ఉందని మాధవన్ అన్నాడు. ‘‘ఇస్రోవాళ్లు పంచాంగం చూసి పెట్టిన ముహుర్తం వల్లే.. భారత మార్స్ మిషన్ అవాంతరాలను ఎదురించి కక్ష్యలోకి చేరింది. గ్రహాల స్థితిగతులన్నీ పంచాంగాల్లో నిక్షిప్తమై ఉంటాయి’’ అని మాధవన్ అన్నాడు.
ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా.. ఇది చూసిన నెటిజన్లు మాధవన్ ని ట్రోల్ చేస్తున్నారు. ‘మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా?’ అని కొందరు నిలదీస్తే.. ‘ఇవేం పిచ్చి మాటలు’ అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సైన్స్ అనేది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. అలాగని సైన్స్ తెలియకపోవడం కూడా పెద్ద సమస్య కాదు. కానీ.. అసలు విషయం తెలుసుకోకుండా ఇలా మాట్లాడే బదులు, సైలెంట్గా ఉండటం మంచిది’’ అని ఇంకొందరు హితవు పలికారు. ఇలా తన మీద ట్రోల్స్ వస్తుండడంతో.. తనదైన శైలిలో మాధవన్ రియాక్ట్ అయ్యాడు. ‘‘పంచాంగం గురించి మాట్లాడినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. నేను నిజంగా అజ్ఞానిని. అయితే.. ఇవేమీ 2 ఇంజిన్ లతో మార్స్ మిషన్ సాధించామనే నిజాన్ని మార్చదు. దానికదే రికార్డు. వికాస్ ఇంజిన్ ఒక రాక్స్టార్’’ అంటూ ట్వీట్ చేశాడు.
కాగా.. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితం ఆధారంగా రూపొందిన రాకెట్రీ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, స్టార్ హీరో సూర్య కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో జులై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.