పూరీ జగన్నాథ్ చివరి రెండు సినిమాలు ఆయనపై ప్రభావాన్ని చూపాయి. ‘లైగర్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా ఆ సమయంలో నష్టపోయిన బయ్యర్లకు కొంత శాతం తిరిగి చెల్లిస్తానని పూరీ హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీ నెరవేరలేదనే ఆరోపణలు ఉన్నా, తర్వాత వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’** విషయంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఈ సినిమా థియేట్రికల్ నష్టాల్లో కొంత భాగాన్ని భరిస్తానని చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరగలేదని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పూరీపై గతంలో ఎప్పుడూ లేనంతగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read :Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’కు బ్రేక్ ..కారణం ఏంటంటే?
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్లో ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ అనే సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. కానీ, పాత బకాయిల ఇష్యూ ఇప్పుడు ఈ సినిమా విడుదలకు పెద్ద అడ్డంకిగా మారింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ బకాయిలు తీర్చనిదే ‘స్లమ్ డాగ్’ విడుదలకు సహకరించబోమని తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. ఇప్పటికే సుమారు రూ. 5 కోట్ల బకాయిలకు సంబంధించి ఆర్బిట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోన్న క్రమంలో ఈ గొడవలు సర్దుమణిగితేనే సినిమాను కొనుగోలు చేస్తామని ప్రముఖ OTT సంస్థలు కూడా నిబంధనలు పెడుతున్నట్లు సమాచారం. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా బౌన్స్ బ్యాక్ అవ్వడం పూరీకి కొత్తేమీ కాదు కానీ ఈసారి సమస్యలు ఆర్థికంగానే కాకుండా, నమ్మకానికి సంబంధించినవి కూడా కావడంతో ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ‘స్లమ్ డాగ్’ సినిమా స్మూత్గా థియేటర్లలోకి రావాలంటే పూరీ జగన్నాథ్ స్వయంగా రంగంలోకి దిగి ఈ వివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
