Srinivas Avasarala: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ వంటి మ్యూజికల్ హిట్స్ తర్వాత శ్రీనివాస్ అవసరాల – నాగశౌర్య కలయికలో వస్తున్న సినిమా ఇది. మార్చి 17న సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా అవసరాల శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడారు. తొలుత ఈ టైటిల్ గురించి ఆయన చెబుతూ, “ఇది చాలా సహజంగా ఉండే కథ. నిజ జీవితంలో నేను చూసిన కొన్ని సంఘటనల ఆధారంగా దీన్ని రాసుకున్నాను. ఇది జనాలకు దగ్గరగా ఉండే కథ. మనకు తెలిసిన కథలా, మనలో ఒకరి కథలా ఉంటుంది. అంత సహజమైన సినిమాకి ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ లాంటి టైటిల్ పెడితే బాగుంటుందనిపించింది. మొదట దీనిని వర్కింగ్ టైటిల్ అనుకున్నాను. అయితే ఈ టైటిల్ నిర్మాతలకు ఎంతగానో నచ్చి వెంటనే రిజిస్టర్ చేయించారు” అని చెప్పారు. సినిమా మీద ఉన్న అంచనాలను గురించి చెబుతూ, “నాది – నాగ శౌర్య కాంబినేషన్ లో సినిమా అనగానే అందరూ ‘ఊహలు గుసగుసలాడే’ తరహాలో రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ అయ్యుంటుంది అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా స్క్రిప్టెడ్ లాగా అనిపించదు. నిజ జీవితంలో పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయి, ఎలా మాట్లాడుతారో అలాగే ఈ సినిమా ఉంటుంది. ట్రైలర్ చూశాక ఈ సినిమా ఎలా ఉండబోతుందో మీకో అవగాహన వస్తుంది. ప్రతి సినిమాకి ఓ శైలి ఉంటుంది. నా గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది” అని చెప్పారు.
ఈ సినిమా విడుదలలో జాప్యం జరగడానికి కారణం వివరిస్తూ, “నేను కథ రాయడానికి ఏడాది, ఏడాదిన్నర సమయం తీసుకుంటాను. అలా ఈ సినిమా 2019లో మొదలుపెట్టాను. 2020 లో యూకే, యూఎస్ లో షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా కోవిడ్ కారణంగా వీసాలు ఇవ్వడం ఆపేశారు. ఆ తరువాత 2022 లో యూకే వెళ్లి షూటింగ్ పూర్తి చేశాం. అప్పుడు కూడా 40 మందికి వీసాలు అప్లై చేస్తే పదిమందికే ఇచ్చారు. మొత్తానికి సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేసి, ఇప్పుడు విడుదలకు వస్తున్నాం” అని తెలిపారు. సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ తో అనుబంధం గురించి వివరిస్తూ, “కళ్యాణ్ మాలిక్ గారు ‘అష్టాచమ్మా’ సినిమా సమయం నుంచే తెలుసు. మా ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. మా ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో ఒకరికొకరికి తెలుసు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు సంగీత దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తీసుకురావడంతో నేనంటే కొంచెం ఎక్కువ ప్రేమ ఆయనకు. ఆ అనుబంధం వల్లే సినిమా సినిమాకి ఇంకా మంచి అవుట్ పుట్ వస్తోంది. ‘కనుల చాటు మేఘమా’ పాటను కీరవాణి గారి లాంటి దిగ్గజం సహా అందరూ ప్రశంసించడంతో కళ్యాణ్ మాలిక్ గారు ఎంతో ఆనందంగా ఉన్నారు” అని చెప్పారు.
నాగశౌర్యతో వరసగా మూవీస్ చేయడం గురించి వివరిస్తూ, “నాగశౌర్య నాకు చాలా ఇష్టమైన నటుడు. యూకేలో షూటింగ్ కి పదిమందితోనే వెళ్లడంతో అక్కడ మేం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే నాగశౌర్య తన నటనతో ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేసేవాడు. ప్రతిరోజూ అవుట్ పుట్ చూసుకొని సంతృప్తి కలిగేది. ఇది ముఖ్యంగా నటన మీద ఆధారపడిన సినిమా. నాగశౌర్య ఎంత బాగా నటించాడనేది మీకు సినిమా చూశాక తెలుస్తుంది. అయితే నేను కథ రాసుకునేటప్పుడు ఫలానా నటుడిని దృష్టిలో పెట్టుకొని రాయను. కథ రాసుకున్నాక దానికి తగ్గ నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకుంటాను. ఇక సినిమా విషయానికి వస్తే.. ఇందులో ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ నిడివి సుమారుగా 20 నిమిషాలు ఉంటుంది. ఈ ఏడు చాప్టర్లు పదేళ్ల వ్యవధిలో జరుగుతాయి. ఈ పదేళ్లలో 18 నుంచి 28 ఏళ్ళ వరకు నాగశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. వయసుకి తగ్గట్లుగా పాత్ర తాలూకు ప్రవర్తన, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడానికి నాగశౌర్య ఎంతో కష్టపడ్డాడు” అని అన్నారు. ఈ సినిమాకు ఇంగ్లీష్ సినిమా ‘బిఫోర్ సన్రైజ్’ ప్రేరణ అని చెబుతూ, “నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ తరహా సినిమా తెలుగులో చేయాలి అనిపించింది. ఇలాంటి సినిమాలకు డైలాగ్స్ స్క్రిప్టెడ్ ఉంటే సహజత్వం పోతుంది. నటీనటులు సహజంగా మాట్లాడున్నట్లు ఉండాలి. దర్శకుడిగా నా బలం నటీనటుల నుంచి సహజ నటన రాబట్టుకోవడం. నేను ఫ్రేమ్ లో మొదట నటీనటులు అభినయం ఎలా ఉంది అనేదే చూస్తాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. మా నిర్మాతలు నన్ను, నా కథని, ఈ ప్రయోగాన్ని నమ్మారు” అని అన్నారు.
చివరగా తన ఇతర కార్యకలాపాలను గురించి చెబుతూ, “ఒకసారి ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ ఫోన్ చేసి తెలుగులో సంభాషణలు రాస్తారా అని అడిగారు. అప్పటికే ఆ సినిమా గురించి నాకు తెలుసు. నాగార్జున గారు కూడా నటిస్తున్నారని తెలుసు. పెద్ద సినిమా, ఎక్కువమంది చేరువయ్యే సినిమా కావడంతో వెంటనే రాయడానికి అంగీకరించాను. ఆ సినిమా చూసి నాకు ‘అవతార్-2’ అవకాశం ఇచ్చారు. హిందీ సినిమాలతో పోల్చితే ఇంగ్లీష్ సినిమాలకు తెలుగు సంభాషణలు రాయడం కొంచెం కష్టం. దానిని ఛాలెంజింగ్ గా తీసుకుని ‘అవతార్-2’ కి రాశాను. ఇక నటన విషయానికి వస్తే ‘కన్యాశుల్కం’ అనే వెబ్ సిరీస్ చేశాను. త్వరలోనే విడుదల కానుంది” అని చెప్పారు.