ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్…ఇలా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయని, వాటిని కూర్చుని చర్చించుకుని ఎవరికీ ఇబ్బందులు తలెత్తని రీతిలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, “నేను నిర్మాతను, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కూడా సుదీర్ఘ అనుభవంతో చెబుతున్నాను. ఎగ్జిబిటర్స్ అయినా నిర్మాతలు అయినా కేవలం తమ సమస్యలు మాత్రమే హైలైట్ చేసుకోవడం, అవి మాత్రమే పరిష్కారం కావాలనుకోవడం కరెక్ట్ కాదు. సమస్యను ఎప్పుడైనా రెండు వైపులా చూడాలి. ఇప్పుడు అలా చూడకుండా తమ సమస్య మాత్రమే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. నిన్న ఎగ్జిబిటర్స్ పెట్టిన ప్రెస్ మీట్ లో సింగిల్ థియేటర్స్ కు రేట్ల పెంపు జీవో ఇచ్చినా అమలు పరచమని చెప్పడం ఎంతమాత్రం సహేతుకం కాదు. సింగిల్ థియేటర్స్ సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. మల్టీ ఫ్లెక్స్ థియేటర్స్ ఎంత తక్కువమంది ప్రేక్షకులు వచ్చినా సినిమాను రన్ చేస్తారు. సింగిల్ థియేటర్స్ కు అలా రన్ చేయడం కష్టమవుతుంది. సింగిల్ థియేటర్స్ కు పర్సంటేజీ అడగడం కరెక్ట్ కాదు. రెంటల్ కొంతమేరకు హైక్ అడగవచ్చు.
ఇలా అనేక సమస్యలు ఇరువైపులా ఉన్నాయి. అలాగే చిన్న సినిమాకు న్యాయం జరగాలి. చిన్న నిర్మాత, పెద్ద నిర్మాత అందరూ బావుండాలి. ఈ నెల 15న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరగబోయే సమావేశంలో అందరి శ్రేయస్సు ను కాంక్షిస్తూ నిర్ణయాలు జరగాలి” అని అన్నారు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణమని ఈ సందర్భంగా నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. దిల్ రాజు వర్సెస్ మైత్రీ మధ్య కోల్డ్ వార్ వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ కుటుంబం సినిమాల విడుదలకు ముందు కావాలని పని కట్టుకుని సమస్యలను సృష్టిస్తున్నారని, ప్రతీసారి వారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆయన ప్రశించారు. జూన్ 4న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైన సమయంలో అంతకుముందు ఎప్పుడూ వీరికి సమస్యలు కనిపించలేదా? సినిమా విడుదలకు ముందు ఇలా సమస్యలు సృష్టిస్తూ…జీవో లను సైతం అమలు చేయమని చెప్పడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలని అన్నారు. ఇలా అభిమానుల్లో కలవరం కలిగించడం కరెక్ట్ కాదని…అయినా ఎట్టి పరిస్థితులలో పెద్ది సినిమాను ఆపలేరని ఆయన అన్నారు.
