విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కొల్లిపర బాలగంగాధర తిలక్ ఒకరు. ఇలా అంటే ఎవరికీ తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే సినీ అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలని తపించేవారు తిలక్. ఆ తపనే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది.
కె.బి.తిలక్ 1926 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ స్వయాన అక్క కుమారుడే తిలక్. వీరి అక్కనే మళ్ళీ ఎల్వీ ప్రసాద్ వివాహమాడారు. అలా ఎల్వీ ప్రసాద్, తిలక్ కు మేనమామ, బావ కూడా అవుతారు. ప్రసాద్ స్ఫూర్తితోనే తిలక్ చిత్రసీమలో అడుగు పెట్టారు. అంతకు ముందు అభ్యుదయ భావాలతో తిరిగేవారు. ప్రజానాట్యమండలిలో చురుగ్గా పాల్గొనేవారు. కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలలోనూ ఉత్సాహంగా పాల్గొని సాగేవారు. ఎల్.వి.ప్రసాద్ వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన తిలక్, 1956లో ‘ముద్దుబిడ్డ’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జగ్గయ్య, జమున నటించిన ఈ సినిమా మంచి పేరు సంపాదించి పెట్టింది. అప్పటికే యన్టీఆర్, ఏయన్నార్ టాప్ హీరోస్ గా సాగుతున్నందున్న తిలక్, తన మిత్రుడు జగ్గయ్యతోనే సినిమాలు తీస్తూ ఆయననూ ఓ ప్రముఖ కథానాయకునిగా నిలిపారు. జగ్గయ్య, సావిత్రితో తరువాత తిలక్ తీసిన ‘ఎమ్.ఎల్.ఏ.’ సైతం జనాన్ని ఆకట్టుకుంది. ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రాన్ని తమిళంలోనూ ‘మామియరుమ్ ఒరు వీట్టు మరుమగలే’ రూపొందించి, రెండు చోట్లా ఆదరణ సంపాదించారు. జగ్గయ్య హీరోగా, ఆరుద్ర రచన, పెండ్యాల సంగీతంతో సాగారు తిలక్. “ఈడు-జోడు, ఉయ్యాల-జంపాల, పంతాలు – పట్టింపులు” వంటి చిత్రాలు తెరకెక్కించారు. “ఛోటీ బహు, కంగన్” వంటి హిందీ చిత్రాలనూ రూపొందించారు.
తిలక్ రూపొందించిన ‘భూమికోసం’ చిత్రంతోనే జయప్రద పరిచయమయ్యారు. కృష్ణ, ప్రభ జంటగా తిలక్ తెరకెక్కించిన ‘కొల్లేటి కాపురం’ కూడా అలరించింది. ఆయన దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘ధర్మవడ్డీ’. సినిమా రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు, అన్నిటా పెరిగిపోయిన వేగం ఆయనకు నచ్చలేదు. దాంతో 1982 తరువాత నుంచీ సినిమాలకు దూరంగా ఉన్నారాయన. 2008లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం తిలక్ ను బి.యన్.రెడ్డి జాతీయ అవార్డుతో గౌరవించింది. 2010 సెప్టెంబర్ 23న తిలక్ కన్నుమూశారు. ఈ నాటికీ తిలక్ చిత్రాల్లోని కథావస్తువును, సంగీతసాహిత్యాలను అప్పటి సినీ ఫ్యాన్స్ నెమరువేసుకుంటూనే ఉన్నారు.