Joruga Husharuga: బేబి చిత్రంలో నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న యూత్ఫుల్ కథానాయకుడు విరాజ్ అశ్విన్.. ఆ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్నాడు. ప్రస్తుతం విరాజ్ హీరోగా నటిస్తున్న చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అను ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నాడు. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత నిరీష్ తిరువిధుల. ఇందుకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ను బుధవారం విడుదల చేశారు.
ఇక ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. “యూత్ఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన టీజర్కు, పాటలకు మంచి స్పందన వచ్చింది.. సినిమాలో అందర్ని ఆకట్టుకునే వినోదం కూడా వుంది. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ గారి సహకారంతో చిత్రాన్ని డిసెంబరు 15న విడుదల చేస్తున్నాం” అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో విరాజ్ అశ్విన్ను కొత్తగా చూస్తారు. ఆయన పాత్రలో మంచి ఎనర్జీ వుంటుంది. బేబి చిత్రంతో యూత్కు దగ్గరైన విరాజ్ ఈ చిత్రంతో వారికి మరింత చేరువతాడు. కొత్తదనం ఆశించే ప్రతి ఒక్కరికి మా చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది” అన్నారు. మరి ఈ సినిమాతో విరాజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.