NTR: “నాన్నగారు ఎన్టీయార్ శతజయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆయన ప్రభావం, ప్రాభవం ఇప్పటికీ తెలుగు జాతికి స్ఫూర్తినిస్తుందనటానికి ఇదే నిదర్శనం” అని అన్నారు నందమూరి బాలకృష్ణ. ఎన్ .టి .ఆర్. శత జయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి. డి. జనార్థన్ సారధ్యంలో నందమూరి బాలకృష్ణతో కమిటీ సభ్యులు ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిటీ చేస్తున్న కృషిని జనార్దన్ బాలకృష్ణకు వివరించారు.
ఎన్.టి.ఆర్. శతజయంతి సంవత్సరంలో ఆయన తరతరాలకు గుర్తుండిపోయేలా తమ కమిటీ గత ఆరు నెలలుగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందని బాలకృష్ణకు జనార్దన్ చెప్పారు. ‘జయహో ఎన్.టి.ఆర్.’ పేరుతో వెబ్ సైట్ ను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో రామారావు గారికి సంబంధించిన వ్యాసాలు, వీడియోలు ఉంటాయని, అలాగే రామారావు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, బయట చేసిన ప్రసంగాలను రెండు పుస్తకాలుగా తీసుకొస్తున్నామని, ‘శకపురుషుడు’ పేరుతో ఒక ప్రత్యేక సంచిక రూపకల్పన చేస్తున్నామని, ఇందులో రామారావు సినిమా, రాజకీయ జీవితంపై విశ్లేషణాత్మక వ్యాసాలు, అపురూపు, అరుదైన ఛాయా చిత్రాలు ఉంటాయ’ని జనార్దన్ తెలిపారు. ఎన్.టి.ఆర్. శత జయంతి వేడుకలను విజయవాడ, హైదరాబాద్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని జనార్దన్ చెప్పారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ, “మా తండ్రే నాకు స్ఫూర్తి ప్రదాత.ఆయన మార్గంలోనే నేనూ ప్రయాణిస్తున్నాను. మా తండ్రిగారు సినిమా రంగంలో సాధించిన విజయాలు, చేసిన వినూత్న ప్రయోగాలు, ముఖ్యమంత్రిగా ప్రజల అభ్యున్నతికి ఆయన చేపట్టిన పథకాలు ఈనాడు దేశమంతా అమలవుతున్నాయి. దీని ద్వారా ఆయన దూరదృష్టి ఎలాంటిదో ఇప్పటి తరాలకు తెలుస్తోంది. వారిని ఎప్పటికీ ప్రజలు గుర్తుంచుకునేలా మీరు చేస్తున్న అసామాన్యమైన కృషికి కృతజ్ఞతలు. మేం కూడా ఈ కృషిలో భాగస్వాములమవుతాం” అని హామీ ఇచ్చారు. బాలకృష్ణను కలిసిన వారిలో చైర్మన్ టి. డి. జనార్థన్, సభ్యులు కాట్రగడ్డ ప్రసాద్, భగీరథ, విక్రమ్ పూల, అట్లూరి నారాయణరావు, డి. రామ్ మోహన్ రావు, మండవ సతీష్, కె. రఘురామ్, శ్రీపతి సతీష్ తో పాటు విజయ్ భాస్కర్, గౌతమ్ బాలకృష్ణ తదితరులు ఉన్నారు.