Ajith: ప్రముఖ నిర్మాత బోనికపూర్ తమిళంలో వరుసగా అజిత్ తో సినిమాను నిర్మిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన తాజాగా నిర్మించిన ‘తునివు’ సినిమా తెలుగులో ‘తెగింపు’ పేరుతో డబ్ అవుతోంది. సంక్రాంతి కానుకగా దీన్ని జనవరి 12న విడుదల చేయబోతున్నారు. తెలుగు సినిమాను రాధాకృష్ణ ఎంటర్ టైన్ మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్స్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జిబ్రాన్ స్వరాలు సమకూర్చాడు. మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముతిరఖని వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
విశేషం ఏమంటే… ఈ సినిమాతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ‘వారిసు’ కూడా 12వ తేదీనే రిలీజ్ అవుతోంది. దీన్ని తెలుగు, తమిళ భాషల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించాడు. అయితే… నిర్మాత బోనీకపూర్ తో ఉన్న అనుబంధం కారణంగా ‘తెగింపు’ సినిమానూ ‘దిల్’ రాజు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అయితే… తన సొంత సినిమా ‘వారసుడు’ కూడా ఉండటంతో ‘దిల్’ రాజు… బోనీ కపూర్ మాట కాదనలేక నైజాం, విశాఖ జిల్లాలో మాత్రమే ‘తెగింపు’ను విడుదల చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. సంక్రాంతికే బరిలో దిగుతున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రెండింటినీ విజయపథంలోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత వారిమీద పడ్డట్టే, ‘వారసుడు’, ‘తెగింపు’లను సక్సెస్ ట్రాక్ ఎక్కించాల్సిన బాధ్యత ‘దిల్’ రాజు మీద పడింది. మరి సంక్రాంతి బరిలో ఏ సినిమా విజయకేతనం ఎగరేస్తుందో చూడాలి!!