పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. 2008లో ముంబై పేలుళ్ల తర్వాత బీసీసీఐ పాకిస్థాన్ను నిషేధించింది. 2012-13 నుంచి ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగలేదు. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో మాత్రమే ఇరు దేశాలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. తాజా టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో టీమిండియా పాకిస్థాన్తో ఐసీసీ ఈవెంట్లలోనూ పాల్గొనకూడదన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. టీమిండియాతో ఆడకపోతే పాకిస్థాన్కు పుట్టగతులుండవని, భారత్తో జరిగే మ్యాచ్ల ద్వారా ఆ దేశ క్రికెట్ బోర్డుకు కోట్లాది రూపాయలు వస్తున్నాయని, ఇకనైనా భారత్ పాకిస్థాన్తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించాడు.
Anitha Chowdary: ‘సూరీడు’ తల్లి కొత్త బిజినెస్ పెట్టిందోచ్!
పాకిస్థాన్తో క్రికెట్ సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని బీసీసీఐని కోరాడు. భారత్పై జరిపిన టెర్రర్ ఎటాక్కి ఇండియా గట్టిగా సమాధానమివ్వాలని అన్నాడు. కోల్కతాలో విలేకరులతో మాట్లాడిన సౌరవ్ గంగూలీ.. ప్రతి ఏడాది ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఉగ్రదాడులపై మనం కఠినంగా వ్యవహరించాలని చెప్పాడు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా భారత్-పాకిస్థాన్ జట్లు ఐసీసీ నిర్వహించే T20, వన్డే ప్రపంచ కప్, ICC ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ఆసియా కప్లలో మాత్రమే తలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 2008 నుండి పాకిస్థాన్ ఇండియాలో పర్యటించలేదు. అయితే ఐసీసీ ఈవెంట్లలో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాల్సి వస్తే.. ఆ మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారు. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇరు దేశాలు తలపడిన మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించారు.