(అక్టోబర్ 7న కొండవీటి సింహం
కు 40 ఏళ్ళు)
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు అభినయంతో దిక్కులు పిక్కటిల్లేలా విజయగర్జన చేసిన చిత్రం కొండవీటి సింహం
. యన్టీఆర్ తండ్రీకొడుకులుగా నటించి, వరుసగా మూడు సంవత్సరాలు సూపర్ హిట్స్ తో హ్యాట్రిక్
సాధించారు. వాటిలో సర్దార్ పాపారాయుడు (1980), కొండవీటి సింహం (1981), జస్టిస్ చౌదరి (1982) ఉన్నాయి. అందులో రెండవ చిత్రమే
కొండవీటి సింహం. యన్టీఆర్ తో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రాలలో
కొండవీటి సింహంస్థానం ప్రత్యేకమైనది. అంతకు ముందు యన్టీఆర్ తో రాఘవేంద్రరావు రూపొందించిన చిత్రాలన్నీ ఓ ఎత్తు. ఆ తరువాత వచ్చిన సినిమాలు మరో ఎత్తు అని చెప్పవచ్చు. రామారావు, రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన తొలి చిత్రం
అడవిరాముడు. ఆ సినిమా నెలకొల్పిన అరుదైన రికార్డులు ఈ నాటికీ చెక్కుచెదరక నిలచే ఉన్నాయి. ఆ తరువాత వారిద్దరి కలయికలో ``సింహబలుడు, కేడీ నంబర్ వన్, డ్రైవర్ రాముడు, వేటగాడు, రౌడీరాముడు-కొంటెకృష్ణుడు, గజదొంగ, తిరుగులేని మనిషి, సత్యం-శివం`` వంటి చిత్రాలు వెలుగు చూశాయి. ఈ సినిమాల టాక్ ఎలా ఉన్నా, వీటిలోనూ అన్నీ వసూళ్ళ వర్షం కురిపించినవే. అయితే ఈ చిత్రాలన్నిటా యన్టీఆర్ కొంటె చేష్టలు చేస్తూ, చిందులు వేసిన కథలే ఉన్నాయి. నటునిగా ఆయనను రాఘవేంద్రరావు సరిగా ఉపయోగించుకోలేదు. ఆ లోటును భర్తీ చేసుకోవడానికి అన్నట్టుగా
కొండవీటి సింహంచిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. అంతకు ముందు యన్టీఆర్, రాఘవేంద్రరావు కాంబోలోనే
వేటగాడుచిత్రాన్ని నిర్మించిన రోజామూవీస్ అధినేతలు అర్జునరాజు, శివరామరాజు, కుమార్జీ ఈ సినిమానూ తెరకెక్కించారు. 1981 అక్టోబర్ 7న దసరాకానుకగా విడుదలయిన
కొండవీటి సింహం` విజయగర్జనతో ఆ నాడు దిక్కులు పిక్కటిల్లి పోయాయి అనే చెప్పాలి.
యన్టీఆర్ అంటే…
అక్కడ కొంతా, ఇక్కడ కొంత కథలు పోగేసి ఓ కథను తయారు చేసుకోవడం అన్నది అడవిరాముడు
నుంచీ రాఘవేంద్రరావుకు అలవాటే! ఈ కథను కూడా అలాగే తయారు చేసుకున్నారు. తమిళంలో శివాజీగణేశన్ నటించిన తంగపతక
లో ప్రధానాంశం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మరో విశేషమేమిటంటే, ఆ తంగపతక
చిత్రం తెలుగులో బంగారు పతకం
గానూ అనువాదమై తెలుగునేలపైనా ఘనవిజయం సాధించింది. ఆ కథలోని ప్రధానాంశాన్ని తీసుకొని, దానికి హీరోకు మరో కొడుకు ఉన్నట్టుగా కథను అల్లి కొంండవీటి సింహం
రూపొందించారు. ఇక కొండవీటి సింహం
అన్నది అంతకు ముందు 1969లో వచ్చిన ఎమ్జీఆర్ డబ్బింగ్ సినిమా టైటిల్. తమిళంలో ఎమ్జీఆర్ తో తెరకెక్కిన అడిమై పెన్
ను తెలుగులో కొండవీటి సింహం
పేరుతో అనువదించారు. ఆ చిత్రమూ మంచి విజయం సాధించింది. అందులోని కొన్ని అంశాలతో యన్టీఆర్ రాజపుత్ర రహస్యం
తెరకెక్కగా, రామారావు సింహబలుడు
లోనూ కొన్ని సన్నివేశాలు ఉపయోగించుకున్నారు. ఏది ఏమైనా తమిళ టాప్ స్టార్స్ ఎమ్జీఆర్, శివాజీగణేశన్ చిత్రాలతో యన్టీఆర్ తెలుగు చిత్రం కొండవీటి సింహం
కు బంధం ఉంది. ఇక్కడ మరో విషయం గుర్తు చేసుకోవాలి. ఓ సినిమా సభలో యన్టీఆర్ ను ఉద్దేశించి ఆ నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఇలా చమత్కరించారు – యన్టీఆర్ అంటే ఒక్కరే కాదు... ఎమ్జీఆర్ లాగా ఆయన మాస్ హీరో, శివాజీగణేశన్ లాగా ఆల్ రౌండర్, జెమినీగణేశన్ లాగా గ్లామర్ హీరో - ఇలా ముగ్గురు స్టార్స్ కలబోసిన ఇమేజ్ యన్టీఆర్ ది...
. ఆ మాటను నిజం చేస్తూనే ఇందులో యన్టీఆర్ ను గ్లామర్ హీరోగానూ చూపించారు రాఘవేంద్రరావు.
ఇదీ యన్టీఆర్ కొండవీటి సింహం
…
ఇక కథలోకి తొంగి చూస్తే… సర్కిల్ ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ భార్య అన్నపూర్ణ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బాబు పుట్టుక వల్ల కన్నవారికి అరిష్టం అని జోస్యం చెబుతారు. దాంతో ఆ బాబును తమ పనిమనిషి దంపతులకు ఇచ్చి అన్నపూర్ణ తండ్రి వారిని వేరే చోటకు పంపిస్తారు. తరువాత రంజిత్ కుమార్, అన్నపూర్ణ దంపతులకు మరో కొడుకు పుడతాడు. వాడి పేరు రవి. చిన్నతనం నుంచీ చెడు అలవాట్లు ఉన్న రవిని రంజిత్ కుమార్ పరివర్తన చెందాలని బోస్టన్ స్కూలుకు పంపిస్తాడు. పనిమనిషి చేతితో పెరిగిన బాబు పేరు రాము. పెరిగి పెద్దవాడై ఉద్యోగం కోసం పట్నం వస్తాడు. దేవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి రంజిత్ కుమార్ ప్రాణస్నేహితుడు గోపాలం కూతురు. పెరిగి పెద్దవాడైన రవి ఇంటికి వచ్చి కన్నవారిని కన్నీరు పెట్టిస్తాడు. తల్లి కోరికపై ఇంట్లోనే ఉంటూ కూడా తప్పుడు పనులు చేస్తూంటారు. రవికి దేవి నచ్చుతుంది. కానీ, ఆ అమ్మాయి అతణ్ణి పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించదు. దాంతో రవి తన ఆఫీసులో పనిచేసే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. ఓ దొంగతనంలో పాలు పంచుకున్న రవిని రంజిత్ కుమార్ ఎస్పీ హోదాలో అరెస్ట్ చేస్తారు. తండ్రిపైనే రవి పగ పడతాడు. రంజిత్ కుమార్ ను అంతమొందించాలని చూస్తున్న నాగరాజుతో చేతులు కలుపుతాడు. తండ్రిని వృత్తిలో దోషిగా నిలుపుతాడు. అయితే రంజిత్ కుమార్ చాకచక్యంగా దుండగులను అరెస్ట్ చేయిస్తాడు. అదే సమయంలో ఆయన భార్య అన్నపూర్ణ మరణిస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన రాము తల్లి రంజిత్ కుమార్ ను చూస్తుంది. రాముకు నిజం చెబుతుంది. తల కొరివి పెట్టడానికి కూడా రవి అంగీకరించడు. రాము తాను రంజిత్ కుమార్ తనయుడిని అని చెబితే తండ్రికి ఏమవుతుందో అనే కారణంతో నిజం దాస్తాడు. అతనే తల్లికి కర్మకాండ నిర్వహిస్తాడు. నాగరాజు, దేశద్రోహులతో చేతులు కలిపి దేశభద్రతకు సంబంధించిన ప్లాన్ ను శత్రువులకు అందించాలని చూస్తాడు. అతని పన్నాగం కనిపెట్టి, రంజిత్ కుమార్ వేషంలో రామువెళ్ళి మట్టుపెట్టాలనుకుంటాడు. అయితే నాగరాజు, రాముని, రవిని, వారి భార్యలను బంధిస్తాడు. అప్పుడు అసలు రంజిత్ కుమార్ వచ్చి ప్రాణాలకు తెగించి, తన కన్నబిడ్డలను రక్షించుకుంటాడు. రవికి తండ్రి మంచి మనసు తెలిసి కన్నీరు మున్నీరు అవుతాడు. తనయుల చేతిలోనే రంజిత్ కుమార్ కన్నుమూయడంతో కథ ముగుస్తుంది.
ఈ కథలో రంజిత్ కుమార్, రవి, అన్నపూర్ణ పాత్రలే బంగారు పతకం
ను గుర్తుకు తెస్తాయి. మిగతా కథను రాఘవేంద్రరావు తనదైన శైలిలో నడిపించారు. ఈ చిత్రానికి సత్యానంద్ సంభాషణలు దన్నుగా నిలిచాయి. ఇక చక్రవర్తి సంగీతం, వేటూరి పాటలు ఈ సినిమాకు మరింత వన్నె తెచ్చాయి. ఇందులోని ఈ మధుమాసంలో... నీ ధరహాసంలో...
, అత్తమడుగువాగులోన... అత్త కూతురో...
, పిల్లవుంది పిల్లమీద కోరికుంది...
, బంగినపల్లి మామిడిపండు...
, మా ఇంటిలోన మహలక్ష్మి నీవే...
, వానొచ్చే వరదొచ్చే...
, గోతికాడ గుంటనక్క నక్కిచూడనీ...
పాటలు జనాన్ని అలరించాయి. ఇక యన్టీఆర్, శ్రీదేవి పాటల్లో వేసిన స్టెప్స్ జనాన్ని థియేటర్లలో కుదురుగా కూర్చోనీయలేదు.
రంజిత్ కుమార్ , రాము పాత్రల్లో యన్టీఆర్ నటించగా, అన్నపూర్ణగా జయంతి, దేవిగా శ్రీదేవి, రవిగా మోహన్ బాబు అభినయించారు. మిగిలిన పాత్రలలో రావుగోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, నగేశ్, మమత, ముక్కామల, కాంతారావు, పుష్ఫలత, గీత, చలపతిరావు, సుభాషిణి, మాస్టర్ హరీశ్ నటించారు. నటరత్న యన్టీఆర్ నటనావైభవంగా రూపొందిన ఈ చిత్రం అన్నివర్గాల వారినీ విశేషంగా అలరించింది.
కొండవీటి సింహం
చిత్రం తొలుత 36 కేంద్రాలలో, తరువాత 20 కేంద్రాలలో మొత్తం 56 సెంటర్స్ లో వందరోజులు ఆడింది. మొదటి రిలీజ్ లో 15 కేంద్రాలలో తరువాత మరో రెండు కేంద్రాలలో వెరసి 17 కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకుందీ చిత్రం. ఆ మరుసటి సంవత్సరమే 1982లో వచ్చిన యన్టీఆర్ బొబ్బిలిపులి
ఫస్ట్ రిలీజ్ లోనే 39 కేంద్రాలలో శతదినోత్సవం చూసి రికార్డు నెలకొల్పింది. ఈ సెంటర్స్ రికార్డును మళ్ళీ యన్టీఆర్ శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర
అధిగమించింది. ఆ తరువాత చాలా ఏళ్ళకు ఇతర చిత్రాలు ఈ రికార్డులను దాటగలిగాయి. దాదాపు 16 ఏళ్ళ వరకు ఈ రికార్డులను ఏ చిత్రమూ దాటలేకపోవడం గమనార్హం!
అన్న మాటే… ఉన్న బాట…
ఆ రోజుల్లో ఓ చిత్రం ఓ థియేటర్ లో వందరోజులు ఆడితే, సదరు థియేటర్ సిబ్బందికి బోనస్ ఇవ్వవలసి ఉండేది. అలాగే సిల్వర్ జూబ్లీ ఆడినా నిర్మాత కొంత ఖర్చు పెట్టుకోవాలి, థియేటర్ యాజమాన్యానికీ ఖర్చు తప్పేది కాదు. ఇక వసూళ్ళు తగ్గినా సినిమాను అదే పనిగా ఆడిస్తే యన్టీఆర్ అంగీకరించేవారు కారు. వేరే సెంటర్ లో వేస్తే నిర్మాతకు డబ్బులు వస్తాయి కదా అన్నది ఆయన లెక్క. ఓ సినిమా ఘనవిజయానికి ఆ చిత్రం థియేటర్లలో ఆడేది కొలమానం కాదని, నిర్మాత పెట్టిన పెట్టుబడికి సదరు సినిమా ఎంత రాబడి చూసింది అన్నదే ముఖ్యమని యన్టీఆర్ చెప్పేవారు. ఈ సినిమాను పలు కేంద్రాలలో ఎత్తేస్తూ ఉంటే అభిమానులు గోల చేశారు. రామారావుకు ఈ విషయం చెబితే, ఆయన అలా నిర్మాతలను ఇబ్బంది పెట్టరాదని ఫ్యాన్స్ ను అనునయించి పంపారు. అయితే రామారావు తన అభిమానులను ఏ నాడూ తలదించుకొనేలా చేయలేదు. కొండవీటి సింహం
వసూళ్ల పరంగా అప్పట్లో నెలకొల్పిన రికార్డులు కొట్టడానికి టిక్కెట్ రేట్లు పెంచుకున్నాకే సాధ్యమయింది. పైగా 1981లో ఏ చిత్రమూ కొండవీటి సింహం
స్థాయిలో తక్కువ రోజుల్లోనే ఎక్కువ మొత్తాలు వసూలు చేయలేదు. ఇప్పుడు సినీజనం అంతా తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం చూడాలని తంటాలు పడుతోంది. ఆ రోజునే యన్టీఆర్ ఈ విషయాన్ని చెప్పారు. అదే ఇప్పుడు సాగుతోంది.
దిక్కులు పిక్కటిల్లేలా చేసిన విజయగర్జన!
కొండవీటి సింహం
చిత్రం అనేక కేంద్రాలలో మూడు ఆటలతో వందరోజులు చూసిన తొలి చిత్రంగా నిలచింది. పలు కేంద్రాలలో ఈ చిత్రంతోనే వందరోజులు మొదలయ్యాయి. వైజాగ్ శరత్ ఏసీలో కొండవీటి సింహం
ఫుల్స్ లో రికార్డు నెలకొల్పింది. ఆ తరువాత ఆ రికార్డును పలు చిత్రాలు అధిగమించినా, కొండవీటి సింహం
మొత్తాన్ని మాత్రం చూడలేకపోయాయి. ఈ సినిమా తొలి విడుదలలో 36 కేంద్రాలలో శతదినోత్సవం చూడగా, వాటిలో ప్రతి కేంద్రంలోనూ థియేటర్ రికార్డో, టౌన్ రికార్డో, స్టేట్ రికార్డో ఉండడం విశేషం! ఇక ఈ చిత్రంలోని పాటలకు అభిమానులు వేసిన చిల్లరడబ్బులు థియేటర్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కసువు ఊడ్చే సమయంలో ఆనందం పంచేవి. ఇలా ఒకటి రెండు కేంద్రాలలో కాదు ఈ చిత్రం ఆడిన అన్ని కేంద్రాలలోనూ స్వీపర్స్ ఇదే అనుభూతి చెందారు. ఇక సైకిల్ స్టాండ్ వారికి, పార్కింగ్ వారికి కూడా ఈ చిత్రం మంచి మొత్తాలు చూపింది. ఆ తరువాత ఎన్ని సినిమాలు అదే థియేటర్లలో వంద రోజులు ఆడినా, కొండవీటి సింహం
స్థాయిలో వసూళ్ళు చూడలేదనే థియేటర్ల వారు, అందులో పనిచేసేవారు చెబుతూ ఉండేవారు. యన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత శ్లాబ్ సిస్టమ్ ప్రవేశం పెట్టడం, థియేటర్లలో టిక్కెట్ రేట్లు పెరగడం జరిగేదాకా కొండవీటి సింహం
నిజాయితీ రికార్డులను ఎవరూ అధిగమించలేక పోయారనే చెప్పాలి. ఏది ఏమైనా నలభై ఏళ్ళ క్రితం యన్టీఆర్ కొండవీటి సింహం
గా చేసిన విజయగర్జన ఈ నాటికీ నాటి అభిమానుల మదిలో మారుమోగుతూనే ఉంది.