రష్యా-ఉక్రెయిన్ మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య గత నాలుగేళ్ల నుంచి భీకర యుద్ధం సాగుతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక శాంతి చర్చలు ప్రారంభించారు. కానీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. మరోసారి ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలకు సిద్ధపడుతుండగా అకస్మాత్తుగా ఉక్రెయిన్.. రష్యాపై డ్రోన్ దాడులు చేసింది. దీంతో రష్యా వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇది కూడా చదవండి: Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?
ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సరికొత్త వాతావరణం నెలకొంది. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన చర్చల్లో కీలక పురోగతి లభించింది. శాంతి చర్చలు ఫలించడంతో 25 ఏళ్లలోపు రష్యా-ఉక్రెయిన్కు చెందిన ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. దీంతో యుద్ధ ఖైదీల ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. వీళ్లంతా యుద్ధం ప్రారంభం నుంచి ఉన్న ఖైదీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక రహస్య ప్రదేశంలో ఈ ఖైదీల మార్పిడి జరిగినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Musk: ట్రంప్తో గొడవపై మస్క్ క్షమాపణ.. పోస్టులపై విచారం
ఖైదీల విడుదలకు సంబంధించిన వీడియోను రష్యా రక్షణ శాఖ పోస్టు చేసింది. ప్రస్తుతం బెలారస్లో వైద్యం అందిస్తున్నట్లు తెలిపింది. తర్వాత మాస్కోలోని ఆస్పత్రులకు తరలిస్తామని వెల్లడించింది. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా యుద్ధ ఖైదీల మార్పిడిని ధ్రువీకరించారు. ఇస్తాంబుల్లో జరిగిన రెండో దశ చర్చల్లో బందీలను మార్చుకునేందుకు ఇరువర్గాలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఓ వైపు చర్చలు కొనసాగుతుండగానే రష్యా ఇంకోవైపు ఉక్రెయిన్పై డ్రోన్ దాడులు చేస్తూనే ఉంది. మంగళవారం కీవ్పై దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా.. 13 మంది గాయపడ్డారు. గత మూడేళ్ల యుద్ధంలో రష్యా జరిపిన అతిపెద్ద దాడుల్లో ఇది ఒకటని జెలెన్స్కీ వెల్లడించారు. ఇక ఉక్రెయిన్ కూడా ఇటీవల స్పైడర్ వెబ్ పేరుతో రష్యాపై భీకర దాడులు చేశారు.