ప్రపంచదేశాల్లో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా ఆసుపత్రుల్లో రోగులకు వైద్యం అందించేందుకు, సేవలు చేసేందుకు కావాల్సిన వైద్యులు, నర్సుల కొరత ప్రపంచదేశాల్లో అధికంగా ఉన్నది. అయితే, ఏ దేశానికీ ఆ దేశం ఇప్పుడు ఈ కొరత లేకుండా చూసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడి ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి అధికంగా ఉన్నది. దీంతో వివిధ దేశాల నుంచి నర్సులను రిక్రూట్ చేసుకోవడానికి ఆయా దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ఫిలిప్పీన్స్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమకు వ్యాక్సిన్ అందిస్తే దానికి బదులుగా ఆయా దేశాలకు నర్సులను అందిస్తామని ప్రకటించింది. ఆసియాలోని అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనా, ఫిలిప్పీన్స్ లో మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టలేదు. చైనా 148 మిలియన్ డోసుల వ్యాక్సిన్లను అందించేందుకు ముందుకు వచ్చింది. మరి ఫిలిప్పీన్స్ ఆఫర్ ను ప్రపంచదేశాలు వినియోగించుకుంటాయా చూడాలి. అయితే, ఫిలిప్పీన్స్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి నర్సులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసేందుకు తమకు ఆసక్తిగా ఉందని, కానీ, ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం ఇలా తమను బలిచేయడం తగదని అంటున్నారు.