ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లపై అమెరికా 20 ఏళ్ల పాటు జరిపిన పోరాటంలో పాకిస్తాన్ భాగస్వామ్యం కావడంపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా.. కేవలం డబ్బు కోసమే అమెరికాతో తమ దేశం అప్పట్లో చేతులు కలిపిందని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్లో మంగళవారం విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ”ఇతరులు మనల్ని వాడుకునేందుకు నాడు మనమే అవకాశమిచ్చాం. దేశ ప్రతిష్టను పణంగా పెట్టాం. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా, డబ్బు కోసం విదేశాంగ విధానాన్ని రూపొందించాం. ఆఫ్ఘన్లో యుద్ధం మనకు మనమే చేసుకున్న గాయం.
దీనిపై ఇతరులెవర్నీ నిందించలేం” అని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఆఫ్ఘన్ విషయంలో అమెరికాతో కలిసి ముందుకెళ్లాలని 2001లో నిర్ణయం తీసుకున్నవారితో ఆ రోజుల్లో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని ఆయన తెలిపారు. దీంతో అప్పటి పరిస్థితులపై తనకు పూర్తిస్థాయి అవగాహన ఉందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు నాడు తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే వచ్చాయని ఆయన తెలిపారు. ఇప్పుడు ఆప్ఘాన్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ దేశాలు ఆప్ఘాన్ ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.