ప్రీపెయిడ్ పేరుతో 28 రోజుల రీఛార్జ్ విధానం అమలు చేస్తూ కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న టెలికాం సంస్థలకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) షాకిచ్చింది. ఇక నుంచి ప్రీపెయిడ్ కస్టమర్లకు గతంలో లాగా 30 రోజులు చెల్లుబాటయ్యే ప్లాన్లు అందించాలని ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ మేరకు టెలికమ్యూనికేషన్ ఆర్డర్ 1999కి మార్పు చేస్తూ.. ప్రతి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కనీసం ఒక ప్లాన్ వోచర్, ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్, ఒక కాంబో వోచర్ను 30 రోజుల వాలిడిటీతో అందించాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది.
Read Also: మరోసారి రూ.50వేలు దాటిన బంగారం ధర
60 రోజుల్లోగా ఈ నిర్ణయం అమల్లోకి తేవాలని టెలికాం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. తాజా సవరణతో మొబైల్ ప్రీపెయిడ్ కస్టమర్లు సరైన వాలిడిటీ లేదా వ్యవధి ఉన్న సర్వీస్ ఆఫర్లను ఎంచుకోవడానికి మరిన్ని ఆప్షన్లు ఎంచుకునే అవకాశముందని ట్రాయ్ వివరించింది. కాగా 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ల వల్ల ఏడాదికి కస్టమర్లు 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది.