RBI-Card Tokenisation: కార్డ్ టోకెనైజేషన్ కోసం విధించిన డెడ్లైన్ రేపు శుక్రవారంతో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగించే ఆలోచన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి లేనట్లు కనిపిస్తోంది. డెడ్లైన్ పొడిగించాలని చిన్న వ్యాపారుల నుంచి డిమాండ్లు వస్తున్నప్పటికీ కేంద్ర బ్యాంకు నుంచి మాత్రం అలాంటి సానుకూల సంకేతాలేవీ ఇప్పటివరకు వెలువడలేదు. కార్డ్ డేటాను భద్రపరచడానికి ఆర్బీఐ ఈ భారీ కసరత్తును మూడేళ్ల కిందటే ప్రారంభించింది. కార్డ్లను ఈ నెల 30లోపు టోకనైజ్ చేయాలని వ్యాపారాలను ఆదేశించింది.
గతేడాది కన్నా 85.4 శాతం ఎక్కువ
ఈజిప్ట్ను ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 49 లక్షల మంది సందర్శించారు. ఈ సంఖ్య 2021లోని ప్రథమార్ధంతో పోల్చితే 85 శాతం కన్నా ఎక్కువ కావటం చెప్పుకోదగ్గ విషయం. 2021లో జనవరి నుంచి జూన్ వరకు 26 లక్షల మంది మాత్రమే టూరిస్టులు ఈజిప్ట్లో పర్యటించారు. గతేడాది మొత్తమ్మీద ఆ దేశాన్ని 80 లక్షల మంది సందర్శించగా 2020తో పోల్చితే ఈ సంఖ్య 117 శాతం కన్నా ఎక్కువ కావటం విశేషం. వరల్డ్ టూరిజం డే సందర్భంగా సెంట్రల్ ఏజెన్సీ ఫర్ పబ్లిక్ మొబిలైజేషన్ అండ్ స్టాటిస్టిక్స్ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
ఒన్ అండ్ ఓన్లీ.. ఆకాశ్ అంబానీ..
రిలయెన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ అరుదైన ఘనత సాధించారు. అమెరికా వార్తా సంస్థ టైమ్స్ రూపొందించిన 100 మంది ఎమర్జింగ్ లీడర్ల జాబితాలో చోటు సంపాదించారు. తద్వారా ఈ ఫీట్ను సొంతం చేసుకున్న ఒకే ఒక్క భారతీయుడిగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని రంగాలకు చెందినవారితో ‘టైమ్స్ హండ్రెడ్ నెక్స్ట్’ పేరిట ఈ లిస్టును తయారుచేశారు. భారత సంతతికి చెందిన అమెరికన్ ఓన్లీ ఫ్యాన్స్ సంస్థ అధినేత ఆమ్రపాలి గన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆకాశ్ అంబానీ.. ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు అనే సంగతి తెలిసిందే.