జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. కుప్వారాలోని కేరన్ సెక్టార్లో చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పక్కా నిఘా సమాచారం మేరకు నవంబర్ 7న సైన్యం ఆపరేషన్ ప్రారంభించింది.
దేశంలో మరో 4 కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. వారణాసిలో ప్రధాని మోడీ జెండా ఊపి రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లు వారణాసి-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ, ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో పరుగులు తీయనున్నాయి.
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య చర్చలు మళ్లీ విఫలం అయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకుండా చర్చలు ముగిశాయి. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలం అయ్యాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు.
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. కోబ్రీ సమీపంలో గురువారం ఐదుగురు భారతీయ కార్మికులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేశారని భద్రతా వర్గాలు తెలిపాయి. కార్మికులు విద్యుత్ ప్రాజెక్ట్లో పని చేస్తున్నట్లు వెల్లడించాయి. ఇక కిడ్నాప్ వార్తలను కంపెనీ కూడా ధృవీకరించింది.
నవంబర్ నెలాఖరున దక్షిణాఫ్రికాలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశాలకు వెళ్లకూడదని అమెరికా నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన ఏ అధికారి కూడా ఈ సమావేశాలకు వెళ్లడం లేదని ట్రంప్ శుక్రవారం వెల్లడించారు.
పాకిస్థాన్ కూడా అణు పరీక్షలు చేయబోతుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ తాజాగా స్పందించారు. భారతదేశం భయంతో ఏ అడుగు వేయదని తేల్చి చెప్పారు. ఇతర దేశాలు ఏం చేయాలనుకుంటున్నాయో చేయనివ్వండన్నారు.
ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల సామర్థ్యం అమెరికా దగ్గర ఉందని మరోసారి ట్రంప్ స్పష్టం చేశారు. వైట్హౌస్లో విలేకర్లతో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా అణ్వాయుధ నిరాయుధీకరణపై మాట్లాడుతూనే ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల శక్తి అమెరికా సొంతం అని పునరావృతం చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత పైలట్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మీడియాలో లేనిపోని కథనాలు ప్రచురించాయి. పైలట్ ఆత్మహత్య కారణంగానే ఎయిరిండియా విమాన ప్రమాదం జరిగిందంటూ కథనాలు ప్రచురించాయి. అయితే కథనాలను పైలట్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
వందేమాతరం అనేది ఒక మంత్రం.. ఒక కల.. ఒక సంకల్పం.. ఒక శక్తి అని ప్రధాని మోడీ అన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చరిత్రకు గుర్తుగా స్మారక తపాలా బిళ్ళ, స్మారక నాణెంను మోడీ ఆవిష్కరించనున్నారు.
ఓట్ల దొంగతనంపై మరోసారి లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హోల్సేల్గా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడారు.