వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 71వ రోజు విచారణలో భాగంగా వైఎస్ కుటుంబంలోని వైఎస్ ప్రకాశ్రెడ్డిని కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారిస్తుంది. పులివెందుల ఆర్అండ్బీ అతిథిగృహంలో జరుగుతోన్న ఈ విచారణలో వివేక హత్యకు సంబంధించి పలు కోణాల్లో వారిని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకాకు ఏమైనా ఆస్తి తగాదాలు, రాజకీయ విభేదాలు, చంపుకునేంత వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. కాగా, వైఎస్ కుటుంబంలో పెద్ద వయసు గల వ్యక్తి వైఎస్ ప్రకాష్ రెడ్డి. అంతర్గతంగా సమస్యలేవైనా వస్తే ప్రకాష్ రెడ్డి పరిష్కరిస్తుంటాడు. ప్రస్తుతం సీబీఐ ఆయన్ను విచారిస్తుండటంతో సంచలనం సృష్టిస్తోంది.
ఇక సీబీఐ ఇటీవల ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ను గోవాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ కస్టడీలోకి తీసుకుని 10 రోజుల పాటు విచారించింది. కస్టడీ ముగియడంతో ఈ రోజు సునీల్ ను కడప నుంచి పులివెందుల తీసుకెళ్లారు. అక్కడి కోర్టులో సునీల్ యాదవ్ను హాజరు పరచనున్నారు.