YSR Netanna Nestam: ఏపీలో మరో పథకం కింద నగదు పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 23వ తేదీన కృష్ణా జిల్లా పెడనలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకం కోసం ఇప్పటికే నేతన్నల నుంచి దరఖాస్తులు స్వీకరించి.. లబ్ధిదారుల జాబితాలను సచివాలయాలకు పంపించారు. కాగా సొంత మగ్గం ఉన్న బిలో పావర్టీ లైన్ (బీపీఎల్) కుటుంబాలకు చెందిన వారికి ఈ పథకం కింద ఏటా రూ.24వేలు జమ చేస్తున్నారు. పెడన నియోజకవర్గం పరిధిలో 3,161 మంది వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్దిదారులు ఉన్నారు. వారందరూ సభకు రానున్నారు. మచిలీపట్నం, గుడ్లవల్లేరు, పెడన నుంచి పెద్ద ఎత్తున నేత కార్మికులను ఈ బహిరంగ సభకు తరలించేలా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు.
Read Also: Gautam Adani: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి ‘జెడ్ కేటగిరీ’ భద్రత
కాగా పెడనలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద డబ్బులు జమ చేసిన అనంతరం తోటమూలలో ఏర్పాటు కానున్న బహిరంగ సభను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగిస్తారు. మచిలీపట్నం నుంచి పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటైన తరువాత సీఎం జగన్ పర్యటించడం ఇదే తొలిసారి. ఇప్పటికే సీఎం జగన్ పర్యటన, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జోగి రమేష్ సొంత అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఇదే కావడంతో జగన్ పర్యటన, బహిరంగ సభ నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆయనతో పాటు తలశిల రఘురాం, మాజీ మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ రంజిత్, ఎస్పీ జోషువ బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు.