Janasena Party: విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై దాడి కేసులో అరెస్ట్ చేసిన జనసేన కార్యకర్తలను ఆదివారం రాత్రి జిల్లా కోర్టు జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు అరెస్ట్ అయిన వారిలో 61 మంది జనసేన నాయకులకు రూ.10వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. మరో 9 మంది నేతలకు ఈనెల 28 వరకు రిమాండ్ విధించింది. అరెస్ట్ అయిన నేతలందరూ బెయిల్పై విడుదలయ్యే వరకు తాను విశాఖలోనే ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నోవాటెల్ హోటల్లోనే పవన్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ బస చేస్తున్నారు.
Read Also: Pawan Kalyan Live: పవన్ కోసం రాత్రంతా ఫ్యాన్స్ పడిగాపులు
కాగా విశాఖ ఘటనకు సంబంధించి తమ జనసైనికులు 92 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్ట్ చేసినట్టు జనసేన లీగల్ సెల్ పేర్కొంది. వీరిలో 61 మందికి బెయిల్ లభించిందని, 9 మందికి కోర్టు రిమాండ్ విధించిందని తెలిపింది. మిగిలిన వారి బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరగనుంది. అరెస్ట్ అయిన నేతలు, కార్యకర్తలకు అండగా ఉండాలని పవన్ నిర్ణయించారు. మరోవైపు విశాఖ నగరంలో హైటెన్షన్ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ బసచేస్తున్న నోవాటెల్ హోటల్ పోలీసుల ఆధీనంలో ఉంది. హోటల్ వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. హోటల్కు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. కాగా పవన్తో పోలీస్ అధికారులు పలుమార్లు సమావేశమయ్యారు.