Payyavula Keshav: విశాఖపట్నంలోని రుషికొండ భవన నిర్మాణ కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపుల వ్యవహరంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు. రుషికొండ కాంట్రాక్టరుకు ఎందుకు బిల్లులు చెల్లింపులు చేశారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై మండి పడ్డారు. రుషికొండ ప్యాలెస్ కాంట్రాక్టరుకు బిల్లులు ఎందుకు చెల్లించారో వివరణ ఇవ్వాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ పనుల బిల్లులను చెల్లించలేదని అధికారుల వెల్లడించారు. అదే సంస్థ చేపట్టిన వేరే పనులకు బిల్లుల చెల్లింపు జరిగినట్టు వివరించిన అధికారులు.. వేరే బిల్లులైనా సరే.. ఆ కాంట్రాక్టరుకు ఎందుకు చెల్లింపులు జరపాల్సి వచ్చిందని పయ్యావుల కేశవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Read Also: NBK : బెజవాడలో బాలయ్య.. నందమూరి అభిమానుల భారీ ర్యాలీ
గతంలో ఓసారి చెప్పినా.. వినకుంటే ఎలా అంటూ అధికారులపై మంత్రి పయ్యావుల కేశవ్ అసహనం వ్యక్తం చేశారు. అసలు ఆ కాంట్రాక్టరుకు జరిపిన చెల్లింపుల వివరాలు.. ఏయే పనులకు బిల్లులు చెల్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చెల్లింపుల కోసం ఎవరైనా సిఫార్సు చేశారా?.. లేక సొంత నిర్ణయమా?.. అంటూ అధికారులకు మంత్రి ప్రశ్నించారు. ఇకపై ఆ కాంట్రాక్టరు చేపట్టిన ఎలాంటి పనులకైనా సరే బిల్లుల చెల్లింపులు చేపట్టవద్దని స్పష్టం చేశారు. సీఎం లేదా తన దృష్టికి తీసుకు రాకుండా బిల్లుల చెల్లింపులు జరిపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.