Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ చోరీ జరిగింది. లావేరు మండలం మురపాక పంచాయతీలోని గుంటుకుపేటలో సోమవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో మద్యం వ్యానులో దుకాణం వద్దకు చేరుకున్న 11 మంది అక్కడ కాపలాగా ఉన్న ప్రసాద్, దుర్గారావులను సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లి తాళ్లతో బంధించారు. అనంతరం మద్యం దుకాణంలోకి ప్రవేశించి రూ. 11.57 లక్షల విలువైన మద్యం బాటిళ్లను దుండగులు అపహరించుకుపోయారు.
Read Also: Diksha Divas: ఢిల్లీలో దీక్ష దివస్ వేడుకలు.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
చోరీ సమయంలో కాపలాదారుల వద్ద ఉన్న సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, తాళాలను కూడా దుండగులు లాక్కున్నారు. అనంతరం వారి వద్ద ముగ్గురు వ్యక్తులు కాపలాగా ఉండగా, మిగిలినవారు దుకాణంలోకి వెళ్లి చోరీకి పాల్పడ్డారు. దుకాణం గోడకు రంధ్రం చేసి అందులోంచి 7,087 మద్యం సీసాలను తరలించారు. ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ జీఆర్ రాధిక, ఏఎస్పీ విఠల్రావు, డీఎస్పీ మహేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరుపై సూపర్వైజర్, వాచ్మెన్ను వాళ్లు ఆరా తీశారు. డాగ్ స్క్వాడ్, క్లూస్టీమ్ కూడా ఘటనా స్థలిని పరిశీలించింది. కాగా దుండగుల కోసం పోలీసులు ఆరు బృందాలతో గాలిస్తున్నారు.