సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అలవోకగా అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సీనియర్నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. అర్థసత్యాలు, అసత్యాలతో రాష్ర్టంలోని పాడి రైతులను మోసగిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా లీటర్ పాలకు ఇస్తానన్న రూ.4ల బోనస్ జగన్ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. 1950, 60 దశకాల్లో రాష్ట్రంలో ప్రారంభమైన పాడిరైతుల సహాకారసమాఖ్యల మూసివేతకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం జగన్ అమూల్ కి బ్రాండ్ అంబాసిడరుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలోని పాల డెయిరీలను సీఎం జగన్ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. అమూల్ కోసం రూ.2,500ల ప్రభుత్వ సొమ్ము ఖర్చుపెడుతున్న జగన్.. మూతపడిన ఒంగోలు డెయిరీకి రూ.150 కోట్లు కేటాయించ లేరా..? అంటూ ప్రశ్నించారు. దాదాపు 30 వేల మంది రైతుల నుంచి 168 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోందని, రూ.71 కోట్లను పాడి రైతులకు అందించిందని జగన్ చెబుతున్నారని ఆయన మండిపడ్డారు.
Read Also:ఇళ్ల మధ్యలో పబ్ల ఏర్పాటు పై హైకోర్టులో విచారణ
ఆయన లెక్కప్రకారం అమూల్ సంస్థ లీటర్ పాలకు రూ.42.50 పైసలు చెల్లిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి రూ.70లు అని చెప్పడం పచ్చి అబద్ధం కాదా? అంటూ విమర్శించారు. విజయ డెయిరీ 11 శాతమున్న లీటర్ పాలకు రూ.85.55పైసలు ఇస్తుంటే, అమూల్ సంస్థ ఇస్తున్నది కేవలం రూ.77లు మాత్రమేనని పేర్కొన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్న అమూల్ డెయిరీ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయన్నారు. కృష్ణామిల్క్ యూనియన్ సహా, రాష్ట్రంలోని మిల్క్ డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తున్నదని ఆయన వెల్లడించారు.
పశువుల బీమాకు సంబంధించిన సొమ్ముని ఎగ్గొట్టిన వైసీపీ ప్రభుత్వం, గోపాల మిత్రల భవిష్యత్తును అంధకారం చేసేలా ప్రయత్నాలు చేస్తుందన్నారు. పశువైద్యులు వైద్యసేవలకు స్వస్తి పలికి, ప్రభుత్వం చెప్పే అడ్డమైన పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారని నరేంద్ర దుయ్యబట్టారు. సేవాభావంతో పశువుల దాణా అమ్మేవారు ప్రభుత్వానికి రూ. 25వేల డిపాజిట్ కట్టాలనడం దుర్మార్గం కాదా? చిన్నచిన్న సొసైటీలు రూ.25వేలు కట్టేస్థితిలో ఉంటాయా అనే ఆలోచన సీఎంకు లేకపోవడం సిగ్గుచేటు చర్యగా నరేంద్ర పేర్కొన్నారు.