సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్లో ఇంకా చర్చ హాట్ టాపిక్గానే సాగుతోంది.. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. తాజాగా, సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.. రాంగోపాల్ వర్మను పిలిచి భోజనం పెట్టారు.. కానీ, విద్యార్ధుల కడుపు నింపే విషయాన్ని మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోదు అని మండిపడ్డారు.. సినిమా టిక్కెట్ల అంశంలో ప్రభుత్వం ఆలోచన ఏమిటి..? అని ప్రశ్నించిన ఆయన.. సినిమా టిక్కెట్ ధరలు ఒక్కటి తగ్గించి గొప్పగా చెప్పుకోవడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు.. ప్రజలపై అంత ప్రేమే ఉంటే సీఎం జగన్కు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బస్తా ధరలు తగ్గించవచ్చు కదా..? అంటూ ప్రశ్నించారు సోము వీర్రాజు.
Read Also: సర్కార్ చేతిలోకి వొడాఫోన్-ఐడియా..!
ధాన్యం కొనేవాళ్లులేక రైతులు గగ్గోలు పెడుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టదు అని మండిపడ్డారు సోము వీర్రాజు.. సీఎం వైఎస్ జగన్కు దమ్ముంటే రూ. 1400కి ధాన్యం కొనుగోలు చేసి చూపించాలని సవాల్ చేశారు.. నిత్యావసర వస్తువులు, ఇసుక, సిమెంట్ ధరలు కూడా తగ్గించాలని డిమాండ్ చేసిన ఆయన.. ఇవన్నీ ప్రజలకు అవసరం లేనివిగా భావిస్తున్నారా..? అని నిలదీశారు.. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న వాటి ధరలు గురించి మాత్రం మాట్లాడరా..? రెండు కోట్ల మంది ప్రజల గురించి ఆలోచించరా..? కానీ, వేల మంది చూసే సినిమా టిక్కెట్లు తగ్గించి గొప్ప పని చేసినట్లు ప్రగల్భాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ విషయంలో కనీసం సిగ్గు లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సోము వీర్రాజు.