ఏపీలో పొత్తు రాజకీయాలపై వాడీవేడీ చర్చలు కొనసాగుతున్న తరుణంలో.. ప్రభుత్వం సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ చెప్తున్న డైలాగులన్నీ చంద్రబాబువి అని చెప్పారు. పవన్ ఏదో వ్యూహం అంటున్నారు, ఇంతకీ వ్యూహం అంటే ఏంటి? అని ప్రశ్నించారు. ‘‘ఒకరేమో త్యాగాలకు సిద్ధమంటారు, మరొకరు నేనే సీఎం అంటారు, ఇంకొకరు మేం కలవమంటారు, అసలు విపక్ష పార్టీలకు వారిలో వారికే స్పష్టత లేదు’’ అని ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో పొత్తులు పెట్టుకోవడం కరెక్ట్ కాదని, అసలు పొత్తులు పెట్టుకోవడమంటే అదేదో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే, నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదని సజ్జల సెటైర్ వేశారు. పవన్, చంద్రబాబు పొత్తులోనే ఉన్నారని.. చంద్రబాబు కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్లోనే పవన్ నడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు త్యాగం చేస్తానంటున్నారు, అదే సమయంలో లీడ్ చేస్తానని చెప్తున్నారు.. మరోవైపు జనసేన అధికారంలోకి వస్తే నేనే సీఎం అవుతానంటూ పవన్ అంటున్నారు.. మరి రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఎందుకో అర్థం కావడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు.
ఇంతకీ చంద్రబాబు త్యాగం అంటే ఏమిటి? త్యాగం అంటే పవన్ని సీఎం చేస్తారా? చంద్రబాబు లీడ్ చేయడమే త్యాగమా? అంటూ సజ్జల ప్రశ్నించారు. ఇప్పటివరకూ చంద్రబాబు ఎన్ని జంప్లు చేశారో అందరికీ తెలుసని, వీళ్ళు జనాల్ని ఫూల్స్ చేస్తున్నారని అన్నారు. విపక్షాలన్నీ ఊహా ప్రపంచంలో నివసిస్తున్నారేమోనని అనిపిస్తోందంటూ కౌంటర్స్ వేశారు. ఆల్రెడీ ప్రజల్లో ఉన్న తాము, త్వరలోనే గడప గడప కార్యక్రమంతో ప్రజల గడపల్లోకి వెళ్తున్నామని.. దాన్ని ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నారని సజ్జల రామకృష్ణ రెడ్డి వెల్లడించారు.