Andhra Pradesh: విశాఖ రైల్వేజోన్ వ్యవహారంపై కేంద్ర రైల్వే బోర్డు కీలక ప్రకటన చేసింది. కొత్త జోన్ ఏర్పాటు, నిర్వహణ, కార్యకలాపాలకు ఎలాంటి పరిమితి అంటూ లేదని వెల్లడించింది. విశాఖ రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటుకు 2020-21లో రూ.170 కోట్లు కేటాయించినట్టు రైల్వే బోర్డు తెలిపింది. ప్రస్తుతం రూ.106 కోట్లతో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. తూర్పు కోస్తా రైల్వేలో భాగంగా రాయగడ రైల్వే డివిజన్ రూపుదిద్దుకోబోతోందని రైల్వే బోర్డు పేర్కొంది. 2022-23లో రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కోసం రూ.6 లక్షలు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. కాజీపేటను కొత్త డివిజన్ చేసే ప్రతిపాదన ఏమీ లేదని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.
Read Also: Amruta Fadnavis: నరేంద్ర మోదీ “భారత జాతిపిత”.. డిప్యూటీ సీఎం భార్య సంచలన వ్యాఖ్యలు
మరోవైపు విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న రైల్వే జోన్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. దేశంలో మొత్తం 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నా ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదని.. దీంతో ఉద్యోగాల కోసం, రైల్వే పరీక్షల కోసం తెలంగాణలోని సికింద్రాబాద్కు వెళ్లాల్సి వస్తుందని ఏపీ సర్కారు అభిప్రాయపడుతోంది. అటు భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ. 68 వేల కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉన్నాయి. ప్రతి రోజు 21వేల రైళ్లు నడుస్తున్నాయి. దేశంలో 7,350 రైల్వే స్టేషన్ల నుండి ప్రతిరోజు 2.2 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.