ప్రకాశం జిల్లా టంగుటూరులోదారుణ హత్య జరిగింది. బంగారం వ్యాపారి భార్య, కుమార్తెను గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. టంగుటూరులో బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్ భార్య శ్రీదేవి(43), కుమార్తె వెంకట లేఖన(21)లతో నివాసం ఉంటున్నారు. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో ఆర్.కె.జ్యూయలర్స్ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం డిసెంబర్ 3వ తేదీ రాత్రి గం.8-20 సమయంలో భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేసి సమాధానం చెప్పలేదు. కుమార్తెకు ఫోన్ చేయగా కుమార్తె ఫోన్ నుంచి కూడా సమాధానం రాలేదు. దీంతో ఆయన వెంటనే ఇంటికి వెళ్లి చూడగా భార్య శ్రీదేవి, కుమార్తె వెంకట లేఖన(21)లు గొంతు కోసిన స్ధితిలో, తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే అతడు చుట్టు పక్కల వారికి విషయాన్ని తెలిపి పోలీసులకు సమాచారాన్ని అందించాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి సాధించకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
హత్య జరిగి ఇప్పటికి 15రోజులు అవుతంది. తల్లి కూతుళ్ల ఇద్దర్ని అతి కిరాతకంగా హత్య చేసినా చుట్టు పక్కల వారికి ఎలాంటి సౌండ్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముందుగా పార్థీ గ్యాంగ్ పనే అయి ఉంటుందని అనుమానించిన పోలీసులు, ఆ తర్వాత స్థానికులు కూడా అయి ఉండొచ్చు అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పోలీసులకు ఒక్క బ్రేక్ త్రూ పాయింట్ కూడా ఈ హత్య కేసులో లభించలేదు. డాగ్ స్వాకాడ్ తిరిగిన ప్రాంతాన్ని పోలీసులు మరోసారి జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే టంగుటూరులో పలు షాపుల యాజమానులను పోలీసులు విచారించి వారి నుంచి వివరాలను సేకరిస్తున్నారు. కాగా వీరికి ఎవ్వరితోనైనా విబేధాలు ఉన్నాయ అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరో వైపు కేవలం బంగారం కోసమే నిందితులు తల్లి, కూతుళ్లను హత్య చేసి ఉంటే ఇంట్లో ఉన్న బంగారం మొత్తాన్ని ఊడ్చుకు పోవాలని కానీ, కేవలం ఒంటి మీద ఉన్న బంగారు నగలను మాత్రమే తీసుకుని వెళ్లడం అటు పోలీసులను ఇటు స్థానికులను కలవరపెడుతున్నాయి. వారి ఒంటి మీద అయిన గాయలను బట్టి ఈ హత్యలో ఇద్దరి కన్నా ఎక్కువ మంది పాల్గొనే అవకావశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఈ కేసును జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా విడిపోయి కేసు విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో త్వరగా నిందితులను పట్టుకుని ఒక ముగింపు తేవాలని పోలీసులు భావిస్తున్నారు.