ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయింది.. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మారుస్తూ.. అసెంబ్లీలో మంత్రి విడుదల రజిని తీర్మానం ప్రవేశపెట్టడం.. ఆ తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. అయితే, ఈ పరిణామాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.. అసలు, పేరు మార్చి సాధించేది ఏమిటి? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆయన.. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరులో మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలని అనుకొంటున్నారో..? ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోయాతాయా? అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గ విధంగా లేవు అనేది వాస్తవం.. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకలు లేవు.. సిబ్బంది అందుబాటులో లేరు.. ఔషధాలు ఉండవు అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు పవన్ కల్యాణ్… కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకే డా.సుధాకర్ వేధించారని ఆరోపించిన ఆయన.. మానసిక వ్యధకి లోనై మరణించిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు.. మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదన్నారు. ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకో.. కొత్త వివాదాలు సృష్టించేందుకో వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నంలా ఉంది అని అనుమానాలు వ్యక్తం చేశారు. పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు.. పేర్లు మార్చాలి అనుకొన్న పక్షంలో విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా.. ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతో ఉంది. స్వాతంత్ర్య అమృతోత్సవాలు చేసుకున్నాం కాబట్టి విశాఖ కేజీహెచ్ పేరు మార్చి వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెట్టండి అని సలహా ఇచ్చారు పవన్.
ఇక, ఈ పాలకులకు యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు తెలుసా..? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.. ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన దివంగత యల్లాప్రగడ సుబ్బారావు పేరయినా ఈ పాలకులకు తెలుసా? అంటూ తన ప్రకటనలో నిలదీసిన ఆయన.. వైద్య విశ్వ విద్యాలయానికి ఆ రంగంలోని ప్రముఖుల పేరు పెట్టాలనే చిత్తశుద్ధితో కూడిన ఆలోచన ఉండి ఉంటే యల్లాప్రగడ సుబ్బారావు పేరును పరిగణించేవారు.. బోదకాలు, టైఫాయిడ్ లాంటి రోగాలకు మందులు కనుగొని ప్రపంచానికి అందించిన గొప్ప శాస్త్రవేత్త, మన తెలుగు వారైన యల్లాప్రగడ సుబ్బారావు పేరుని కనీసం ఒక్క సంస్థకైనా ఈ పాలకులు పెట్టారా? అని మండిపడ్డారు.. ఇంట్లోవాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టే ముందు – ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలి.