ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎప్పటి నుంచో వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు ప్రజలు.. వజ్రాలు దొరికి కొందరు లక్షలు సంపాదిస్తే.. కొందరు కోటీశ్వరులు అయ్యారని చెబుతారు.. ఇక, చాలా మందికి నిరాశే మిగిలింది.. అయితే, ఉన్నట్టుండి ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీరప్రాంతంలో బంగారపు నగలు దొరుకుతున్నాయనే మాట.. స్థానికుల చెవినపడింది.. దీంతో.. గత రెండు రోజులుగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం జల్లెడ పడుతున్నారు స్థానిక మత్స్యకారులు.. మహిళలు, చిన్నారులు సైతం తీరంలో బంగారం కోసం వేట ప్రారంభించారు..
ఇప్పటికే కొందరికి బంగారు రేణువులు, రూపులు, చెవి దిద్దులు, ఉంగరాలతో పాటు పలు బంగారు, వెండి వస్తువులు దొరికాయని చెబుతున్నారు.. బుధవారం రోజు కొందరికి బంగారు నగలు దొరకగా.. గురువారం రోజు కూడా ఉదయమే వెళ్లి సముద్ర తీర ప్రాంతాన్ని జల్లెడ పెడుతున్నారు ప్రజలు.. కాగా.. గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాన్ సమయాల్లో బయటపడుతున్నాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నమాట.. ఇక, రెండు వరుస తుఫాన్లతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరోవైపు ఈ బంగారం వేట కొనసాగుతోంది. అయితే, సముద్రతీరంలో బంగారం, బంగారు ఆభరణాలు లభ్యం కావడం మాత్రం మిస్టరీగానే మిగిలిపోతోంది. గతంలోనూ ఉప్పాడ బీచ్లో బంగారు నగలు దొరికిన సంగతి విదితమే..