ఎయిడెడ్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ గత నెల రోజుల నుండి విద్యార్థులు ధర్నాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం సరిగా స్పందించలేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ షేక్ షాబ్జి. విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి అటు ప్రభుత్వాలు గానీ ఇటు జిల్లా అధికారులు గానీ స్పందించడం లేదన్నారు. కాకినాడ యుటిఎఫ్ హాల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి మాట్లాడారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ విషయాన్ని రాబోయే శాసనసభ సమావేశాల్లో లేవనెత్తుతామన్నారు.
విద్యార్థులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రాథమిక హక్కు అయిన విద్యను తమకు ఇవ్వాలని అడుగుతుంటే ప్రభుత్వాలు పోలీసులను అడ్డుపెట్టుకొని విద్యార్థులపై కక్ష సాధింపులకు దిగుతోందన్నారు. విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై దర్యాప్తు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరుతున్నామన్నారు.