వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి కేసు నేపథ్యంలో గత రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్దితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే డ్రైవర్ సుబ్రమణ్యం మృతిపై సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. సుబ్రహ్మణ్యం మరణం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, సంఘటన జరిగిన వెంటనే, ప్రక్కదారి పట్టకుండా, చట్టం క్రింద అంతా సమానులే అంటూ బాధ్యులు ఎవరైనా శిక్షపడాల్సిందే అన్న ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, వారికి మనోధైర్యం కల్పించాలని సీఎం ఆదేశించారని, దళితులు సుబ్రహ్మణ్యం మృతి విషయంలో ఎమ్మెల్సీపై అనుమానం వ్యక్తం చేస్తే కేసు నమోదు చేసాం అది మాపార్టీలో ఉన్న నైతికత అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు దళితులపై అఘాయిత్యాలు, దాడులు జరిగితే, అవిచేయించిన చంద్రబాబు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని, దళిత సంక్షేమాన్ని కోరేనాయకుడు మా నాయకుడు, దళితులకు జగన్ ఒక పెట్టని కోట అని ఆయన అన్నారు. సుబ్రమణ్యానిది హాత్యే, మేము చాలా భాదపడుతున్నాం. వందకు 100శాతం సుబ్రమణ్యం కుటుంబానికి అండగా ఉంటాం. చిత్తశుద్దితో కేసుని విచారణ చేస్తున్నాం. దళితులు మీద దాడిచేస్తే ఎలాంటి వాడైనా శిక్షించి తీరుతామని ఆయన హెచ్చరించారు. అనంతబాబుని కేసులో ముద్దాయిగా చేశామని, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షపడుతుందని ఆయన అన్నారు. ఎవరైనా చనిపోతే గ్రద్దల్లా అక్కడకు వెళ్లి నిలబడే తత్వం ప్రదర్శిస్తున్నారని, శవాలు తీసుకెళితే లొకేష్ వస్తారని చెబుతారు, దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయవద్దని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు గుడ్డకాల్చి పడేయాలని చూస్తే ఊరుకొడానికి సిద్దంగా లేమని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.