ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ఇంకా స్పష్టత నెలకొనలేదు. దీంతో తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్నా సినిమాలపై భారం పడే అవకాశం ఉంది. అయితే ఈనెల 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లానాయక్’ సినిమా రిలీజ్కు సిద్ధమవుతున్న వేళ.. ఏపీలో జీవో 35 ప్రకారమే సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ సినిమాలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ను టార్గెట్ చేశారు.. అయినా ఆయనకు ఏమీ కాదు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈగో నీకు ఒక్కడికే కాదు అందరికీ ఉంది.. పవన్ కల్యాణ్ కీ ఉంటుందని ఆయన అన్నారు. ఎన్ని కేసుల్లో ఇరికించావ్.. ఏం చేశావ్.. నువ్ ఏమీ చేయలేవు అని ఆయన మండిపడ్డారు. చిరంజీవి చేతులు జోడించి అడుగారు.. ఆయన బతకలేక నీదగ్గరకు రాలేదు.. సినిమా పరిశ్రమ కోసం వచ్చారని ఆయన అన్నారు. ఇక నుంచి ఏ హీరో, డైరెక్టర్ రాష్ట్రంలో సినిమా తీయరని, సినిమా టికెట్ల ధరల తగ్గింపుకు మేము వ్యతిరేకం కాదు.. కానీ ముందే చెప్పాలి కదా అని ఆయన అన్నారు. అదే ఎవడబ్బ సొమ్మని తిరుమలలో టికెట్ల ధరలు పెంచుతున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.