Minister Nimmala Ramanaidu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు మేనమామనని చెప్పి, ‘అమ్మఒడి’ పథకం కింద ఒకే బిడ్డకు ప్రయోజనం కల్పించి మరో బిడ్డను మోసం చేశారని ఆరోపించారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు నిమ్మల… ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినా, ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విడుదల చేయలేదన్నారు. అలాగే మెగా డీఎస్సీ పేరుతో హామీలు ఇచ్చి, ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. డీఎస్సీ అంశంలో కూడా కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, వైసీపీ నాయకత్వం సమాజంలో చిచ్చు పెట్టే రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కులాల మధ్య గొడవలు రెచ్చగొట్టి రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించిన మంత్రి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులను గాడిలో పెట్టిందన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేసి దేశానికి అంకితం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల పరిస్థితిపై మాట్లాడుతూ, వైసీపీ పాలనలో 400కు పైగా కంపెనీలు రాష్ట్రాన్ని వీడిపోయాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కృషితో కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొస్తూ యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నిమ్మల..
గోదావరి డెల్టా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి చెప్పారు. డెల్టా ప్రక్షాళన కోసం డీపీఆర్ తయారీకి రూ.14 కోట్లు కేటాయించి లైడార్ సర్వే నిర్వహించామని తెలిపారు. డీపీఆర్ పూర్తికాగానే ప్రక్షాళన పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత పాలన కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ సుపరిపాలన అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు.
వైసీపీ నాయకత్వంపై మరోసారి విమర్శలు గుప్పించిన నిమ్మల రామానాయుడు, గత ప్రభుత్వ కాలంలో ప్రజాస్వామ్య స్వేచ్ఛలకు ఆంక్షలు విధించారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయటకు రావాలంటే 144 సెక్షన్, 30 యాక్ట్, అరెస్టులు, పరదాల మధ్య కార్యక్రమాలు నిర్వహించేవారని వ్యాఖ్యానించారు. అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేయడంలో వైసీపీకి పెట్టింది పేరని విమర్శించిన మంత్రి, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అదే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు..

