CPI Ramakrishna: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మహోన్నతుల పేర్లు మార్చే అధికారం ఎవరు ఇచ్చారని సీసీఐ నేత రామకృష్ణ ప్రశ్నించారు. అసెంబ్లీలో బలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం తగదన్నారు. అంతగా వైఎస్ఆర్ పేరు పెట్టుకోవాలని జగన్ భావిస్తే కొత్త యూనివర్సిటీలు నిర్మించి వాటికి పెట్టుకోవాలని సూచించారు. జగన్ నిర్ణయం ముమ్మాటికీ తుగ్లక్ చర్య అని సీపీఐ నేత రామకృష్ణ అభివర్ణించారు. గత మూడేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క యూనివర్సిటీ అయినా జగన్ కట్టారా అని ఆయన నిలదీశారు.
Read Also:Krishnam Raju: కృష్ణంరాజు బతికే ఉన్నారు.. మీరే చూడండి
అటు రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలలో సరైన సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. జగన్ ఈ విషయాన్ని గాలికొదిలేశారని సీపీఐ నేత రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి ఆయన పేరే కొనసాగించాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సూచించారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చారిత్రాత్మకమని.. అదే జిల్లాలో ఎన్టీఆర్ చొరవతో ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆ మహనీయుడి పేరే కొనసాగించాలని వల్లభనేని వంశీమోహన్ కోరారు. అటు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరుమార్పును వ్యతిరేకిస్తూ ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే అనుకుని ఉంటే వైఎస్ఆర్ పేరు, విగ్రహాలు మిగిలుండేవి కావని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోవడం ఎంత ప్రమాదకరమో జగన్కు అర్థంకావడం లేదని మండిపడ్డారు.