గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెదకాకాని ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్లో మాంసాహారం వండటం వివాదాస్పదంగా మారింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడి నుంచే అల్పాహారం, అన్నదానానికి భోజనం సరఫరా అవుతాయి. అదే క్యాంటీన్లో మాంసాహారం వండటం విమర్శలకు దారితీసింది. ఇటీవల ఓ వ్యక్తి వేలంపాటలో క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్నాడు. అతడి దగ్గర నుంచి అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త లీజుకుని తీసుకుని ఇప్పుడు ఈ క్యాంటీన్ను నడుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఎంపీటీసీ భర్త తనకు వచ్చిన ఓ ఆర్డర్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని క్యాంటీన్లో మాంసాహారం వండి బయటకు పంపించినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం క్యాంటీన్ ముందు రిక్షాపై అన్నం, కూర పాత్రలతో పాటు మాంసం కూర కూడా కనిపించడంతో గమనించిన భక్తులు ఫోటోలు తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు, ఆలయ అధికారులు స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయం ఆలయ అధికారుల దృష్టికి వచ్చినా వాళ్లు నోరు మెదపడం లేదు.
https://ntvtelugu.com/power-holiday-for-industries-in-andhra-pradesh/