టీడీపీ 40 వసంతాల వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై కీలక ప్రసంగం చేశారు. ఆనాడు పార్టీ ప్రకటన కోసం ఆదర్శ్నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్కు అతికొద్దిమందితోనే ఎన్టీఆర్ వచ్చారని.. కానీ ఎన్టీఆర్ నుంచి ప్రకటన రాగానే వేలాది మంది తరలివచ్చారని చంద్రబాబు వెల్లడించారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనే ఓ బెంచ్ మార్కును సృష్టించిందని తెలిపారు.
40 ఏళ్ల క్రితం ఇదే రోజున టీడీపీని స్థాపించడం ద్వారా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు జాతికి జరిగిన అవమానాలు చూసిన తర్వాత తెలుగు జాతికి ఏం చేయాలన్న దిశగా ఎన్టీఆర్ ఆలోచించారని.. ఆ ఆలోచనల నుంచే టీడీపీ పుట్టుకొచ్చిందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. పార్టీ ప్రారంభమైన తర్వాత ఈ 40 ఏళ్లలో ఎన్నో రికార్డులను లిఖించామని… మరెన్నో రికార్డులను కూడా బ్రేక్ చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగు జాతిని, టీడీపీని ఏ ఒక్కరూ విడదీయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రస్తుత రాజకీయాలను చూస్తే.. టీడీపీకి ముందు, టీడీపీ తర్వాత అన్నట్టుగా పరిస్థితి తయారైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరోమారు తెలుగు జాతికి పునరంకితం కావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కారణంతోనే పార్టీ పుట్టిన ప్రదేశానికి వచ్చామని స్పష్టం చేశారు.