ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. మొన్న అర్థరాత్రి టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు అశోక్ బాబును నోటీసు తగిలించి సీఐడీ అధికారులు కిడ్నాప్ చేశారు. విచారణ పూర్తైన ఆరోపణలపై మళ్లీ కేసు నమోదు చేశారు. జగన్ ఉన్మాది ముఖ్యమంత్రి మొదటి ఎఫ్.ఐ.ఆర్.కు సెక్షన్లు ఎందుకు మార్చారు.
అశోక్ బాబును అరెస్టు చేసి ఏం విచారణ చేశారు.రాష్ట్రంలో చట్టప్రకారం పాలన జరగాలి.పోలీసులు కూడా చట్టప్రకారమే వ్యవహరించాలి.లేకపోతే ప్రైవేటు కేసులు వేస్తాం.ప్రజలకు అండగా నిలబడడం, పోరాటం చెయ్యడం నేరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. ముగ్గురు మాజీ మంత్రులను ఏం నేరం చేశారని అరెస్టు చేశారు.ప్రభుత్వ వేధింపులతో కోడెలను పొట్టన పెట్టుకున్నారు. అనేకమంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారన్నారు చంద్రబాబు.
గుంటూరులో హత్యకు గురైన అనూష ఇంటికెళ్లి పరామర్శిస్తే లోకేష్ పై కేసు పెట్టారు. 33మంది టీడీపీ నేతలను దారుణంగా హత్య చేశారు.ప్రభుత్వం టెర్రరిస్టులా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. వివేకాను హత్య చేసి నాటకాలాడి నిందితులను హత్య చెయ్యాలని చూస్తున్నారు. తప్పుడు రాజకీయాలు చెయ్యాలనుకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. జైలర్ వరుణ్ రెడ్డిని కడపకు ఎందుకు పంపించారు. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు జైలర్ గా వరుణ్ రెడ్డి ఉన్నారన్నారు చంద్రబాబు.