తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్దం నిర్మించిన పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయం పేరుతో ప్రభుత్వానికి అప్పగించడం మంచి పద్దతి కాదని మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. గతంలో కూడా టీటీడీ ఆస్తులను తాత్కాలికంగా ప్రభుత్వానికి కేటాయిస్తే….ఇప్పటి వరకు వాటిని ఖాళీ చెయ్యలేదన్నారు.
వక్స్ బోర్డ్,క్రిస్టియన్ చారిటీ భూముల నుంచి ప్రభుత్వం ఒక్క అడుగు అన్న ఇలా పొందగలదా అని ప్రశ్నించారు భాను ప్రకాష్ రెడ్డి. ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే త్వరలో టీటీడీ ఆస్తుల పరిరక్షణ ఉద్యమం ప్రారంభిస్తామని భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. మరోవైపు నిన్న శ్రీవారిని 67,750 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,192 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.13 కోట్లు అని టీటీడీ తెలిపింది. ఇవాళ అనంతాళ్వార్ 968వ అవతారోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ. 13వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు నిర్వహించనుంది. తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీచేయనుంది టీటీడీ.