ఇటీవల పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ నేతలు చేసిన దాడిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికార బలంలో వైసీపీ అరాచకాలు, ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోందని ఆగ్రహించారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చిన ఆయన.. దాడికి పాల్పడిన మున్సిపల్ ఛైర్పర్సన్ రమాదేవి భర్త, కుమారులు, బంధువులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం సీఎం జగన్కు లేదని.. ఆస్తుల ధ్వంసం, అక్రమ కేసులపైనే ఆయన ధ్యాస పెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దాడులు చేయడం, ప్రాణాలు తీయడమే వైసీపీ ఎజెండా అని, అరాచకాలకు తెగబడుతూ ప్రజల్ని భయపెడుతున్నారని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, అప్పుడు అరాచక వైసీపీ రౌడీ మూకలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని, అందుకు సిద్ధంగా ఉండమని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.