Telugu Desam Party: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ రిమాండ్ను తిరస్కరిస్తూ విశాఖ చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును ఏపీ సీఐడీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనితో పాటు గురువారం అయ్యన్న పాత్రుడు వేసిన పిటిషన్పై కూడా విచారణ జరిపింది. ఈ సందర్భంగా సెక్షన్ 467 వర్తించదని ఎలా చెబుతారని విశాఖ కోర్టును హైకోర్టు ప్రశ్నించింది. అయ్యన్నపాత్రుడు, రాజేష్లకు నోటీసులు జారీచేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.
కాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తన ఇంటి వెనుక ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కబ్జా చేశారని ఆరోపిస్తూ సీఐడీ అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడు రాజేష్ను గురువారం తెల్లవారుజామున అరెస్టు చేసింది. ఈ మేరకు వీరిద్దరినీ విశాఖ సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే విచారణ జరిపిన కోర్టు వీరి రిమాండ్ను తిరస్కరించింది. అదే సమయంలో బెయిల్ కూడా ఇచ్చి విడుదల చేసింది. దీంతో సీఐడీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించింది.
Read Also: YSRCP Leaders: పవన్ కళ్యాణ్ను చంద్రబాబు బలిపశువు చేస్తున్నారు
అటు జైలు నుంచి విడుదలైన అయ్యన్నపాత్రుడిని నర్సీపట్నంలోని స్వగృహంలో కలిసి పలువురు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ జాబితాలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, వరుపుల రాజా, యనమల కృష్ణుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు ఉన్నారు.