రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి చేయడానికే తమ ప్రభుత్వం ఉందని ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యం కాని తీర్పులు ఉండకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని.. ఏపీ హైకోర్టు చెప్పినట్లు నెలరోజుల్లో రాజధాని నిర్మాణం సాధ్యం కాదని జగన్ వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణపై న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తున్నామని తెలిపారు. వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేయమని, ఆటంకాలు ఎదురైనా ముందుకెళ్తామని జగన్ తేల్చి చెప్పారు.
చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ లేదని.. ఒకవేళ ఉండి ఉంటే విజయవాడ లేదా గుంటూరులో రాజధాని పెట్టేవారని సీఎం జగన్ అన్నారు. ఆ ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి 500 ఎకరాల్లో బిల్డింగులు కట్టేస్తే రాజధాని అయ్యేదన్నారు. అమరావతిపైనే రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన రాష్ట్రం పరిస్థితి ఏంటని జగన్ ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలన వికేంద్రీకరణను కొలిక్కి తీసుకొస్తామని జగన్ తెలిపారు. వికేంద్రీకరణలో అందరి ఆత్మగౌరవం ఉందన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన వారికి న్యాయం చేస్తామని జగన్ పేర్కొన్నారు.