AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..

Chandrababu

Chandrababu

AP CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ముంబైలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి పరామర్శించారు. ఇటీవల పవన్ కల్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు ఈ రోజు ముంబైకి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకోవడంతో పాటు, త్వరగా ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇటీవల కుడి భుజానికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న పవన్ కల్యాణ్‌కు ముంబైలోని ఆస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ఆపరేషన్ విజయవంతంగా పూర్తైందని, ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పవన్ కల్యాణ్‌ను కలవడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. పవన్‌ కల్యాణ్‌కి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైన తర్వాత ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు, పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు.