వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో 1986 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో గోదావరికి వరదలు వచ్చాయని.. నిన్ననే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారని.. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఉండాలని ముందు రాలేదని సీఎం చెప్పారని గుర్తుచేశారు.. ఇక, 3.60 లక్షల మందిని పునరావాస కేంద్రాల్లో ఉంచాం, ఇప్పటికీ సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి, 7 మంది చనిపోయారు.. వారి కుటుంబాలకు సాయం అందించాం, మీకు డబ్బు ఇచ్చిన తర్వాతే పోలవరం నిర్వాసితులను తరలిస్తామని సీఎం స్పష్టంగా చెప్పారన్నారు.. చంద్రబాబు వరద బాధితులను ఓదార్చడానికి వెళ్లి రాజకీయ ఉపన్యాసం చేస్తున్నారని విమర్శించిన ఆయన.. నీ ఐదేళ్ల పదవి కాలంలో వరద ఎప్పుడూ వచ్చింది చంద్రబాబు..? అసలు వర్షం ఎప్పుడన్నా పడిందా? అంటూ సెటైర్లు వేశారు.
పోలవరం ఆలస్యం అవడానికి కారణం ఏవరు…? నువ్వు కాదా…? అంటూ చంద్రబాబును నిలదీశారు మంత్రి బొత్స.. నువ్వు 2014 తర్వాత మూడేళ్లు చిన్న పని కూడా చేయకుండా ఇప్పుడు నేను అంతా చేశాను అంటే నమ్మాలి? అని మండిపడ్డారు.. కేంద్రంతో మాట్లాడి ఆరోజు అర్ అండ్ అర్ ప్యాకేజీ తీసుకురాలేదు..? నీ లాలోచీకి ప్రయోజనాలు తాకట్టు పెట్టిన విషయం అందరికీ తెలుసన్నారు.. ఇవాళ తగుదునమ్మా అంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు.. అది కడుపు మంట.. ప్రజలు అన్నీ అందాయి అంటుంటే ఓర్వలేక పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నీ కార్యకర్తలను పెట్టుకుని మైకుల్లో ఏదేదో మాట్లాడించారు.. మా అధికారులు అంతా అద్భుతంగా పని చేశారని తెలిపారు. మా కార్యకర్త నుంచి మంత్రుల వరకు సహాయక చర్యలు చేపట్టారు… అది మా ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. హెలికాప్టర్ ద్వారా 30 టన్నులు ఆహారం.. పాల ప్యాకెట్లు, బిస్కెట్లు అందించామన్న ఆయన.. ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అని మా సీఎం బహిరంగంగా ప్రజల్ని అడిగారు.. ప్రజలు అంతా బాగా జరిగింది అని జేజేలు కొట్టారన్నారు. ఇస్తామన్న 10 లక్షల ప్యాకేజ్ ఇస్తానని సీఎం హామీ ఇచ్చి వచ్చారని తెలిపారు.
నీ పసుపు చొక్కాలు, కండువాలు..చంద్రబాబుకి జై జై లు తప్పు అనిపించలేదా? అని ప్రశ్నించారు బొత్స.. చావు దగ్గరకు వెళ్ళి కూడా నువ్వు ఇలాంటివే చేస్తావ్? అని ఎద్దేవా చేసిన ఆయన.. నీకు చావుకి పుట్టిన రోజుకీ కూడా తేడా తెలియడం లేదన్నారు.. చంద్రబాబు చెప్పిన ప్రతి అబద్దం అందరికీ అర్థం అవుతోంది.. ఏ రోజు ఆయన సాయం చేశాడో చెప్పమనండి ? అని సవాల్ విసిరారు.. పోలవరాన్ని, ప్రత్యేక హోదా ని తాకట్టు పెట్టినట్లు మేం రాజీనామా చేస్తే మళ్లీ తాకట్టు పెడతాడా? అని మండిపడ్డారు.. పెయిడ్ ఆర్టిస్టులతో ఆయన చప్పట్లు కొట్టించుకుంటూన్నాడు తప్ప మేం కాదన్నారు.. రెండు రోజులు పోతే చికోటి ప్రవీణ్ లాంటి వారితో లింకులు బయటపడొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.