అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎస్ సమీర్ శర్మ, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, కాకాణి గోవర్ధన్రెడ్డి, గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్, రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్ భారతి కో ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) ఆధ్వర్యంలో రెండు విడతల్లో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు సీఎం జగన్ వెల్లడించారు. రూ.560 కోట్లతో 250 కేఎల్డీ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. 100 ఎకరాల్లో ఈ ప్లాంట్ను క్రిబ్కో ఏర్పాటు చేయనుందని.. తద్వారా 400 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022–27లో మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పుడున్న ఎగుమతులను 5 ఏళ్లలో రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్ల ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ పాలసీ 2022–2027లో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.
రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా రంగం నుంచి ఎగుమతులు ఉన్నాయని.. ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం జగన్ ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో మెరైన్ ఎగుమతుల్లో 46శాతం రాష్ట్రం నుంచే ఉన్నందున ఈ రంగాన్ని తగిన విధంగా ప్రోత్సహించాలన్నారు. సింగిల్డెస్క్ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల విధానంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అత్యంత పారదర్శక విధానాల్లో భాగంగా ఈ మార్పులను తీసుకు వచ్చామని తెలిపారు.