భార్యాభర్తల సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కలకాలం జీవించాల్సిన దంపతులు మధ్యలోనే సంబంధాలు దెబ్బతింటున్నాయి. తాజాగా ఓ జంటకు విడాకులిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది.
అతడు వృత్తిరీత్యా న్యాయవాది. 2010లో హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఆరేళ్ల పాటు సంసారం సాఫీగానే సాగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అంతా బాగుందని అనుకుంటున్న తరుణంలో గొడవలు మొదలయ్యాయి. అంతే 2016లో విడిపోయారు.
అయితే భర్త న్యాయవాది కావడంతో న్యాయ నైపుణ్యాన్ని ఉపయోగించి భార్యను వేధించడం ప్రారంభించాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులపై దాదాపుగా 80 కేసులు నమోదు చేశాడు. ఇక కేసు విచారణ సందర్భంగా న్యాయవాది భర్త ప్రవర్తించిన తీరుపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం శాశ్వతంగా జంటను వేరు చేస్తూ విడాకులు మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న హక్కును వినియోగించుకుంటూ తీర్పు వెలువరించింది. దాదాపు దశాబ్దకాలం పాటు సాగిన వైవాహిక వివాదాన్ని ‘‘మహాభారత యుద్ధం వంటిది’’గా అభివర్ణిస్తూ భార్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భరణంగా భార్యకు రూ.5 కోట్లు ఏకమొత్తంగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. భవిష్యత్తులో భార్యపై గానీ, ఆమె కుటుంబ సభ్యులపై గానీ ఎలాంటి వ్యాజ్యాలు దాఖలు చేయబోనని పేర్కొంటూ ఒక అఫిడవిట్ సమర్పించాలని కూడా భర్తను ఆదేశించింది.
ఈ సందర్భంగా భర్త ప్రవర్తనపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘విరోధపూరితమైన, కలహపూరితమైన, కక్షపూరితమైనది’’గా అభివర్ణించింది. ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపి చెల్లింపును తప్పించుకోవడానికి ప్రయత్నించగా కోర్టు దీనిని ‘‘కృత్రిమ కవచం’’గా పేర్కొంది. దీంతో భార్యకు రూ. 5 కోట్లు ఏకమొత్తంగా ఒకేసారి ఇవ్వాలని సూచించింది.
బాధ్యత నుంచి తప్పించుకోవడానికి భర్త ఉద్దేశపూర్వకంగా కుటుంబ కంపెనీల నుంచి రాజీనామా చేసి, న్యాయవాదిగా పరిచయం చేసుకున్నాడని భార్య ఆరోపించగా కోర్టు ఈ విషయంతో ఏకీభవించింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి, భరణం, పిల్లల పోషణ భరణం, వ్యాజ్యపు ఖర్చులతో సహా రూ.5 కోట్ల ఏకమొత్తాన్ని చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఇద్దరు మైనర్ కుమారుల శాశ్వత సంరక్షణ హక్కును తల్లికి అప్పగించగా.. తండ్రికి నెలవారీగా కలుసుకునే హక్కును కల్పించింది. భార్య ప్రస్తుతం తన మామగారి ముంబై ఫ్లాట్లో నివసిస్తోంది. రూ.5 కోట్లు అందిన వెంటనే ఫ్లాట్ను ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది. భవిష్యత్తులో భార్య, ఆమె కుటుంబం లేదా ఆమె న్యాయవాదులపై ఎలాంటి కొత్త కేసులు పెట్టవద్దని భర్తకు సూచించింది. ఈ ఉత్తర్వును ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
అయితే కోర్టు అనుమతి లేకుండా పిల్లలను భార్య కలకత్తాకు తీసుకువెళ్లిందని.. దీంతో పిల్లల్ని సందర్శించే హక్కును కోల్పోయేలా చేసిందని ఆరోపిస్తూ ఈ విషయాన్ని అతిశయోక్తిగా చెప్పడానికి భర్త ప్రయత్నించాడు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘‘ఒక తల్లికి సహజంగా తన పిల్లల సంరక్షణ, శ్రేయస్సు, సురక్షితమైన పెంపకమే ప్రధానమైన బాధ్యత. ఈ చర్యను భార్య దురుద్దేశానికి ఆపాదించలేం. ముంబైలో నెలకొన్న తీవ్రమైన శత్రుత్వం, అనేక వ్యాజ్యాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ తరలింపు ఒక ఆత్మరక్షణ చర్య తప్ప మరేమీ కాదని స్పష్టమవుతోంది.’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.