Vidadala Rajini: మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత విడదల రజని తెలిపారు. చట్టసభల్లో మహిళలకు మూడు వంతుల రిజర్వేషన్లు కల్పించాలనే కల నెరవేరబోతుందని ఆమె పేర్కొన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తే అది దేశ చరిత్రలో గుర్తుండిపోయే రోజుగా నిలుస్తుందని అన్నారు. ఎన్టీవీతో మాట్లాడిన విడదల రజని, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే దేశ స్వరూపమే మారిపోతుందని అభిప్రాయపడ్డారు. మహిళా శక్తితో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని తెలిపారు. దేశ జనాభాలో సగానికి పైగా మహిళలే ఉన్న నేపథ్యంలో వారికి తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం అత్యంత అవసరమని అన్నారు.
Read Also: Rajya Sabha: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా హరివంశ్ ఎన్నిక.. మోడీ అభినందన
రాష్ట్రంలో మహిళా సాధికారత గురించి మాట్లాడిన నేతలు ఇప్పటివరకు మహిళలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే చూశారని విమర్శించారు రజని.. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మహిళా సాధికారత కోసం ప్రత్యేకంగా అడుగులు వేశారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలలో 90 శాతం మహిళల గౌరవం, ఆర్థిక స్థితి మెరుగుపడేలా రూపకల్పన చేశామని రజని చెప్పారు. మహిళలకు డిప్యూటీ సీఎం, హోం మంత్రి వంటి కీలక పదవులు అప్పగించిన నాయకుడు జగన్ మాత్రమేనని కొనియాడారు. మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నాయకుడు జగన్ అని అన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై కూడా విడదల రజని విమర్శలు గుప్పించారు. గత రెండేళ్ల పాలనలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, హత్యలు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదని, భద్రత లేదని అన్నారు. మహిళల భద్రత కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలో దిశా యాప్ తీసుకువచ్చామని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు మాటలు కోటలు దాటుతాయని, కానీ చేతలు గడప దాటవని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో మహిళలు మిస్సయ్యారంటూ ఆరోపణలు చేశారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఒక్కరినైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. మహిళలకు ఇబ్బందులు కలిగించిన తమ పార్టీ నేతలపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. మహిళా బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని, ఈ బిల్లు చట్టరూపం దాల్చి మహిళలకు చారిత్రాత్మక అవకాశాలు కల్పిస్తుందని వైసీపీ ఆశాభావం వ్యక్తం చేసింది.