PM Modi- Chandrababu: అమరావతి పునః ప్రారంభంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ లో ప్రధాని ఇలా రాసుకొచ్చారు.. అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది.. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన్ని మెరుగు పరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. నాకు మంచి మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి అమరావతి పట్ల ఉన్న దార్శనికత, రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నాను అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.
Read Also: Kamala Harris: డ్యాన్స్తో అదరగొట్టిన కమలా హారిస్.. వీడియో వైరల్
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్నారు. కాగా, ప్రజల సహకారంతో, కేంద్రం మద్దతుతో పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం అని హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి.. మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని తెలుపుతూ.. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Shubman Gill: అంపైర్తో శుభ్మన్ గిల్ గొడవ.. అసలు ముచ్చట ఏమిటంటే..?
మరోవైపు, రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవం కార్యక్రమం పూర్తి కావడంతో పనులు వేగవంతం చేసింది. ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు చర్చలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే డిజైన్లు రూపొందిస్తున్న సంస్థలతో మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. సీఆర్డీయే కార్యాలయంలో నార్మన్ పోస్టర్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ అండ్ టీ సంస్థల ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. ఐదు ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు చేస్తున్నారు. ఆయా భవనాల డిజైన్లను మంత్రి, అధికారులకు ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిథులు వివరిస్తున్నారు.