Pawan Kalyan – Balineni Meet: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.. తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్తో భేటీ అవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ గంటన్నర చర్చల వెనుక బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Story Board: డబ్బిస్తే.. ఏదైనా చేసుకోవచ్చా..? ఫామ్ హౌస్లో ఏం జరుగుతోంది..?
ఈ భేటీలోని కీలక అంశాలు చర్చించినట్టుగా తెలుస్తోంది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి బాలినేని తదుపరి అడుగు ఎటు అనే సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్ కల్యాణ్తో జరిగిన ఈ సుదీర్ఘ భేటీ.. అన్ని అనుమానాలు తీరిపోయినట్టుగా సమాచారం.. ప్రకాశం జిల్లాలో, ముఖ్యంగా ఒంగోలు రాజకీయాల్లో తన పట్టును నిలుపుకోవడానికి బాలినేని భావిస్తున్నారు.. ఇదే సమయంలో.. బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని కూడా పవన్ కల్యాణ్కు పరిచయం చేయడం ద్వారా తన రాజకీయ వారసుడి భవిష్యత్తుకు ఇప్పుడే బాటలు వేస్తున్నట్లు కనిపిస్తోంది.
మరో నాలుగు రోజుల్లో మళ్లీ కలుద్దామని పవన్ కల్యాణ్ చెప్పడం చూస్తుంటే, పార్టీలో ఆయనకు ఇచ్చే ప్రాధాన్యత లేదా పదవిపై ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అయితే, బాలినేని శ్రీనివాస రెడ్డి.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మరియు బంధువు కూడా. అలాంటి నేత.. వైసీపీని వీడడం చర్చగా మారింది.. ఇదే సమయంలో బాలినేనికి జనసేనలో సరైన గుర్తింపు దక్కడం లేదనే చర్చ కూడా మరోవైపు సాగింది.. ఈ సమయంలో పవన్ కల్యాణ్-బాలినేని సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది..
