ఏపీలో కరోనా నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 1,00,622 పాజిటివ్ కేసులు ఉండగా… ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు కేవలం 2,301 మందేనని సీఎం జగన్కు అధికారులు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నవారు 3,73,71,243, ఒక డోసు వ్యాక్సిన్ వేసుకున్నవారు 55,38,556 మంది ఉన్నారని పేర్కొన్నారు.
Read Also: ఛలో విజయవాడ సక్సెస్.. జగన్ నియంతృత్వానికి చెంపపెట్టు..!
అటు ఈనెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో ఉన్న 30వేల ఖాళీలను భర్తీచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా ఉండాలని… డాక్టర్లు లేరు, సిబ్బంది లేరనే మాట వినిపించకూడదని సీఎం స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించడంపై దృష్టి ఉంటుందని.. డాక్టర్లు గిరిజన ప్రాంతాల్లోనేఉండి సేవలను అందిస్తానంటే ఎలాంటి ప్రతిపాదనకు అయినా సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందించే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఉంటాయని జగన్ సూచించారు.