యంగ్ హీరో సంతోష్ శోభన్ పుట్టిన రోజు ఇవాళ. పాతికేళ్ళు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి సంతోష్ శోభన్ అడుగుపెట్టాడు. ‘వర్షం’ ఫేమ్ స్వర్గీయ శోభన్ కొడుకైన సంతోష్ కు యుక్త వయసులోనే నటన వైపు గాలి మళ్ళింది. సుమంత్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన ‘గోల్కొండ హైస్కూల్’లో హైస్కూల్ విద్యార్థిగా సంతోష్ నటించాడు. ఆ తర్వాత యుక్తవయసులోకి అడుగు పెట్టగానే ‘తను -నేను’ తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘పేపర్ బోయ్’లోనూ కథానాయకుడిగా నటించాడు. కానీ ఈ రెండు సినిమాలు అతనికి సక్సెస్ ను అందించలేదు. అయితే ఇటీవల యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో నిర్మితమైన ‘ఏక్ మినీ కథ’ సంతోష్ కు హీరోగా ఓ గుర్తింపును తీసుకొచ్చింది.
Read Also : హీరోలపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీ సక్సెస్ రేంజ్ ఏమిటనేది స్పష్టం కాలేదు కానీ ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టి మాత్రం సంతోష్ శోభన్ మీద పడింది. దాంతో అతనిప్పుడు రెండు మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి నూతన దర్శకుడు అభిషేక్ మహర్షి రూపొందిస్తున్న ‘ప్రేమ్ కుమార్’ కాగా, మరొకటి ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్న ‘అన్నీ మంచి శకునములే’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ నిర్మిస్తుండటం విశేషం. ఇవి కాకుండా మరో ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన చర్యలూ జరగుతున్నాయి. మొత్తానికి ఈ యేడాది మన వెండితెర ‘ప్రేమ్ కుమార్’ సంతోష్ శోభన్ కు ‘అన్నీ మంచి శకునములే’ అని అనుకోవచ్చు. అతని పుట్టిన రోజు సందర్భంగా కొన్ని నిర్మాణ సంస్థలు పోస్టర్స్ రూపంలో శుభాకాంక్షలు తెలిపాయి.