ఆక్సిజన్, రెమిడెసివర్, కోవిడ్ కేర్ సెంటర్లు వంటి అన్ని అంశాలు చర్చించాం. తిరుపతి రుయా హాస్పిటల్ సంఘటన పునరావృతం కాకుండా సీఎం కలెక్టర్లు అందరికీ ఆదేశాలు జారీ చేశారు అని మంత్రి ఆళ్ళ నాని అన్నారు. మొదటి దశలో వచ్చిన కేసుల కంటే రెట్టింపు సంఖ్య ఇప్పుడు వచ్చింది. మొదటి వేవ్ లో అత్యధికంగా 240 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం పడింది. గతంలో 17 వేల ఆక్సిజన్ బెడ్లు ఉంటే సెకండ్ వేవ్ లో 11 వేల ఆక్సిజన్ బెడ్లు అదనంగా ఏర్పాటు చేశాం. మరో 10 వేల ఆక్సిజన్ బెడ్ల కోసం చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం కేంద్రం ఇస్తున్న ఆక్సిజన్ కోటా 590 మెట్రిక్ టన్నులు. రాష్ట్ర అవసరం 590 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా ఉంటోంది. అయితే ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆక్సిజన్ కేటాయింపులు పెంచుతుందని ఆశిస్తున్నాం. ఆక్సిజన్ స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. స్థానికంగా ఆక్సిజన్ ఉత్పత్తి పెరిగితే ఒత్తిడి తగ్గుతుంది అని పేర్కొన్నారు. ఆక్సిజన్ వృధా కాకుండా మానిటరింగ్ కమిటీలు కూడా వేశాం అని తెలిపారు. చంద్రబాబు ప్రజలను భయాందోళనలకు గురి చేసే విధంగా మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్ విషయంలో వాస్తవాలు తెలిసి కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఇంగిత ఙానం లేకుండా వ్యవహరిస్తున్నారు. తామే వ్యాక్సిన్ సరఫరాను నియంత్రిస్తున్నామని కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ లో స్పష్టం చేసింది. చంద్రబాబుకు, భారత్ బయోటెక్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినా అదనంగా వ్యాక్సిన్ తెప్పించటంలో ఎటువంటి ప్రయత్నం చేయనని చంద్రబాబు చెప్పటం బాధ్యతారాహిత్యం అని అన్నారు.